Site icon HashtagU Telugu

Rahul Gandhi: ఏపీ కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చిన రాహుల్ గాంధీ

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో దక్షిణాది రాష్ట్రాల్లో విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి. దానిలో భాగంగానే ఏపీలో కూడా భారీ వర్షాలు పడి వరదలు పారుతున్నాయి. వరదల వల్ల చాలా గ్రామాలు నీట మునిగాయి. తీవ్రమైన పంట నష్టం, ఆస్తినష్టం జరగగా, కొంతమేర ప్రాణనష్టం కూడా సంభవించింది.

ఆంధ్రప్రదేశ్ లో వరద పరిస్థితులపై కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్‌ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏపీలో వరదలు తీవ్ర నష్టం కలిగించడంపై విచారం వ్యక్తం చేశారు. ఆత్మీయులను కోల్పోయిన బాధితులకు తన సానుభూతి తెలిపారు. బాధితులకు కాంగ్రెస్‌ కార్యకర్తలు అన్ని విధాలుగా సాయం అందించాలని రాహుల్‌ కోరారు.

ఏపీలో కురుస్తున్న వర్షాలకు నెల్లూరు, కడప,అనంతపూర్, చిత్తూర్ జిలాల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షానికి గోడలు తడిచి బిల్డింగులు కూలడంతో కొందరు, వరదలో కొట్టుకుపోవడం వల్ల మరికొందరు ప్రాణాలు విడిచారు. తాజాగా కురుస్తున్న వర్షాలకు ఇప్పటివరకు ఏపీలో 24మంది చనిపోయారని, 17 మంది గల్లంతయ్యారని ప్రభుత్వం తెలిపింది.

Also Read: రేవంత్ కు పదవీ గండం?

రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలు దెబ్బతిన్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో వరద తీవ్రత అధికంగా ఉంది. ఇప్పటికే పలు పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు బాధితులకు సాయం అందిస్తున్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలను కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

Also Read: ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీద!

Tirupati Update:

తిరుమల, తిరుపతిలో గత మూడు రోజుల్లో కురిసిన వర్షాలకు జనజీవనం అస్త్యవ్యస్తమైంది.  శ్రీవారి భక్తులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పందిస్తూ.. తిరుమల, తిరుపతి లో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని తెలిపారు. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పొర్లి కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంపునకు గురి చేశాయన్నారు. ఈ వర్షాల వలన తిరుమల లో రూ 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.