ప్రధాని నరేంద్ర మోదీ భీమవరం పర్యటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు భీమవరం వచ్చేందుకు సిద్దమవ్వగా..ఆయన ట్రైన్ మధ్యలోనే దిగి హైదరాబాద్కు తిరిగి ప్రయాణమైయ్యారు. రఘురామ కృష్ణంరాజు లింగపల్లిలో రైలు ఎక్కి బేగంపేట రైల్వేస్టేషన్లో దిగారు. ఏపీ పోలీసులు ఆయనను అనుసరించడంతో ఎంపీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఇప్పటికే భీమవరంలో తనకు అనుకూలంగా ర్యాలీ నిర్వహించిన వారిపై పలు కేసులు నమోదు చేసిన తన కార్యకర్తలను ఇబ్బంది పెట్టకూడదని రఘురామ అన్నారు. భీమవరంలో మోడీ పర్యటన ఖరారైనప్పటి నుంచి స్థానిక ఎంపీ రఘురామకృష్ణం రాజు వస్తారా లేదా అన్నది తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. దీనిపై ఎంపీ హైకోర్టును కూడా ఆశ్రయించగా.. న్యాయస్థానం పోలీసులను చట్ట ప్రకారం నడుచుకోవాలని ఆదేశించింది. మరోవైపు రఘురామకృష్ణంరాజును వేదికపైకి అనుమతించే విషయంపై క్లారిటీ ఇచ్చి భీమవరం రాకముందే ఏపీ పోలీసులు ఆయనకు షాక్ ఇచ్చారు. పీఎంవో నుంచి అందిన జాబితాలో రఘురామకృష్ణంరాజు పేరు ప్రస్తావన లేదని, హెలిప్యాడ్కు పిలవాల్సిన జాబితాలో కానీ, వీఐపీ గ్యాలరీ జాబితాలో కానీ లేదని ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు స్పష్టం చేశారు. పైగా ఎంపీ వస్తున్నారనే సమాచారం లేదని ఆయన తెలిపారు.