Site icon HashtagU Telugu

Prisoner Death: రాజమండ్రి జైల్ లో ఖైదీ మృతి, బాబు భద్రతపై టీడీపీ ఆందోళన

Crime

Crime

Prisoner Death: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆయన భద్రత పై టీడీపీ తో పాటు ఇతర పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయన వెంటనే విడుదల చేసి హౌజ్ అరెస్ట్ కు పరిమితం చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ నేపథ్యంలో జైలులో ఓ రిమాండ్ ఖైదీ మరణించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరానికి చెందిన గంజేటి వీరవెంకట సత్యనారాయణ (19) దోపిడీ కేసులో 6 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇటీవల టైఫాయిడ్, రక్తపు వాంతులు కావడంతో చికిత్స పొందుతూ, డెంగ్యూ రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో అతడిని ఈ నెల 19 అర్ధరాత్రి కాకినాడ జీజీహెచ్ చేర్చారు. ఈ మేరకు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై టీడీపీ నాయకులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కావడంతో ప్రత్యేక వసతి కల్పించాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. చంద్రబాబుకు కావాల్సిన మందులు, వైద్య చికిత్స అందించాలని సూచించింది. చంద్రబాబుకు ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకొచ్చేందుకు అనుమతించాలని జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబుకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని జైలు అధికారులకు కీలక సూచనలు చేసింది. అయినా టీడీపీ నాయకులు బాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

Also Read: Pawan Kalyan: మహిళా బిల్లు ఆమోదం పొందటం శుభ పరిణామం: పవన్ కళ్యాణ్