PK – CBN : 2019 సార్వత్రిక ఎన్నికల టైం అంది. అప్పట్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. జగన్ తరఫున పనిచేసిన పీకేపై.. ఆ సమయంలో చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒకానొక సందర్భంలో ‘బిహార్ డెకాయిట్’ అనే పదాన్ని కూడా పీకేపై చంద్రబాబు ప్రయోగించారు. పీకే, చంద్రబాబు మధ్య ఉన్న అంతటి వైరం.. ఇప్పుడు స్నేహంగా ఎలా మారింది ? అనే దానిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఈనేపథ్యంలో తనను బిహార్ డెకాయిట్ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రశాంత్ కిషోర్(PK – CBN) తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘బిహారీ గజదొంగ, డేటా చోరీ చేసేవాడు ’’ అంటూ చంద్రబాబు చేసిన విమర్శలపై పీకే రియాక్టయ్యారు. ‘‘ఎన్నికల్లో ఓడిపోయామనే ఆవేశంతోనే చంద్రబాబు అప్పట్లో నా గురించి అలా మాట్లాడారు. ఇటీవల నేను చంద్రబాబును కలిశాను. నాపై వ్యక్తిగత ద్వేషం లేదని చంద్రబాబు స్పష్టంగా నాతో చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున పనిచేయాలని ఆయన కోరారు. అయితే నేను తిరస్కరించాను. నేను ఆ పనిని వదిలేశానని చంద్రబాబుకు చెప్పాను’’ అని ప్రశాంత్ కిశోర్ వివరించారు.
గతేడాది డిసెంబర్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుణ్ని ప్రశాంత్ కిషోర్ కలిశారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. పీకేను వెంటబెట్టుకుని మరీ చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వేదికగా చంద్రబాబు, ప్రశాంత్ కిషోర్ మధ్య కాసేపు చర్చలు జరిగాయి. ఈ మీటింగ్ నేపథ్యంలో మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ప్రశాంత్ కిషోర్ ఇక తెలుగుదేశానికి పనిచేయబోతున్నాడని, అందుకే చంద్రబాబును కలిశారంటూ వార్తలు వచ్చాయి. శాసనసభ ఎన్నికల సమయంలో ఏం చేయాలనే దానిపై ప్రశాంత్ కిషోర్ ఓ లిస్టు కూడా టీడీపీ అధినేతకు అందించాడనే ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని కాసేపటికే తేల్చేశారు ప్రశాంత్ కిషోర్. వైఎస్ జగన్ తోనే తమ పయనమని ఐప్యాక్ స్పష్టం చేసింది.