ఏపీ రాజకీయాల్లో పీకే టీమ్ ఇస్తోన్న సర్వేల గోల ఎక్కువగా ఉంది. ఆ సర్వేల ఆధారంగా జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో టిక్కెట్లను కేటాయించారు. ఈసారి కూడా అదే పంథాను ఆయన అనుసరిస్తున్నారు. ఆ క్రమంలో మంగళగిరి మీద తొలుత దృష్టి పెట్టారు. అక్కడ సరికొత్త ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారు. అదే తరహాలో సుమారు 70 స్థానాల్లో అభ్యర్థులు మార్చడానికి ఆయన సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ఇంతకూ మంగళగిరి ఆపరేషన్ ఏంటో తెలుసా? అక్కడున్న ఆర్కేని పీకిపడేసి ఆయన స్థానంలో కాండ్రు కమలను సీన్లోకి తీసుకొచ్చారు. అందుకే మూడేళ్ల నుంచి సైలెంట్ గా ఉన్న కమల అకస్మాత్తుగా ఇటీవల జరిగిన `చేనేత హస్తం` కార్యక్రమంలో జగన్ పక్కన ప్రత్యక్షం అయ్యారని వైసీపీ వర్గాల్లోని టాక్.
ఏడాది ముందే ఎన్నికలకు వెళ్లే ఆలోచనతో వైసిపి అధిష్టానం వేగంగా వ్యూహాలు సిద్ధం చేస్తుంది. మంగళగిరి ఫార్ములాను 75 నియోజకవర్గాల్లో అమలు చెయ్యాలనే ఆలోచనలో ఉంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పీకే టీం సర్వే ఇచ్చిన రిపోర్టు బేస్ చేసుకుని జగన్ వేగంగా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు, సీఎం టీం లోని సజ్జలను తరచూ ఆర్కే అవమానించడం, స్థానిక నేతలతో విభేదాలు, ఒంటెద్దు పోకడలు వెరసి నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్త నియామకం చేసే వరకు వెళ్లింది.
మంగళగిరి నుంచి ఎమ్మెల్యే ఆర్కే ,మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఆప్కో ఛైర్మెన్ చిల్లపల్లి మోహన్ రావు, గంజి చిరంజీవి పేర్ల ను పరిశీలిస్తోంది. సర్వే అగ్రస్థానంలో చిల్లపల్లి మోహన్ రావు, కాండ్రు కమల పేర్లు ఉన్నాయని తెలుస్తోంది. వాళ్లిద్దరిని నియోజకవర్గంలో యాక్టివ్ గా ఉండాలని పెడన వేదికపై నుంచి జగన్ నిర్ధేశం చేయడం గమనార్హం.ఇద్దరిలో ఎవరి పనితీరు బాగుంటే వారికి సీటు కేటాయిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇద్దరు సమన్వయంతో పనిచెయ్యాలని సీఎం చెప్పడం చురుగ్గా వాళ్లిద్దరు మంగళగిరి కేంద్రంగా రాజకీయాలు చేస్తున్నారు. సైలెంట్ గా ఉన్న ఈ ఇద్దరి నేతల్ని జగన్ దగ్గరకు తీయడంతో క్యాడర్ ఒక్క సరిగా యాక్టివ్ అయ్యారు. ఇక త్వరలోనే ఈ ఇరువురి నేతల పర్యటనలు ప్రారంభం అవుతాయని. అన్ని కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం. ఎంతో కాలంగా రాజకీయ వనవాసంలో ఉన్న కాండ్రు కమల కి రాజకీయంగా సత్తా చూపేందుకు చక్కటి అవకాశం వచ్చిందని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.