Hindi Language : జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమిళులు, హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలను నటుడు ప్రకాష్ రాజ్ తప్పుబట్టారు. ఆయనకు ఎవరైనా చెప్పండి అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు. హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దవద్దని తమిళనాడు ప్రభుత్వం అంటుంటే.. అన్నీ దేశ భాషలేకదా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటున్నారు. వేరు అనుకుంటే తమిళ సినిమాలను ఇతర భాషల్లోకి డబ్ చేయొద్దని సలహా ఇస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ తప్పుబట్టారు. ఎక్స్ వేదికగా ఆయన సంచలన ట్వీట్ చేశారు. “మీ హిందీ భాషను మా మీద రుద్దకండి”, అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడమని పవన్ కల్యాణ్కి ఎవరైనా చెప్పండి ప్లీజ్’ అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.
"మీ హిందీ భాషను మా మీద రుద్దకండి", అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు, “ స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం", అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి please… 🙏🏿🙏🏿🙏🏿 #justasking
— Prakash Raj (@prakashraaj) March 14, 2025
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..దేశంలో అన్ని భాషలను గౌరవించాలని.. త్రిభాషా వాదన సరికాదని స్పష్టం చేశారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పని వాళ్లను తీసుకురావడం మానేయండి. డబ్బులు మాత్రం హిందీ రాష్ట్రాల నుంచి కావాలి. వారి భాషను మాత్రం మాకొద్దు అంటే ఎలా..? భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు. భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ బలం అని.. దేశానికి బహు భాషలే కావాలని అన్నారు. ‘తమిళనాడులో సంస్కృతాన్ని తిడుతున్నారు. దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారంటూ మాట్లాడుతున్నారు. హిందీ మాకొద్దు అనే తమిళనాడు నాయకులు వారి తమిళ సినిమాలను హిందీ డబ్ చేయడం మానుకోండి అన్నారు.
విధ్వంసం చేయడం చాలా సులువని, నిర్మాణమే చాలా కష్టమన్నారు. తమిళనాడులో చదువుతున్న సమయంలో తానూ వివక్షకు గురయ్యానని, గోల్టి అని తనను పిలిచేవారని చెప్పారు. గోల్టీ అంటే తెలుగుకు రివర్స్ అని తమ మాస్టర్ చెప్పారని పవన్ కల్యాణ్ తెలిపారు. ఇండియా అంటే.. ఉత్తర భారతదేశం హిమాలయాల్లో పరమశివుడున్న కైలాసం దగ్గర నుంచి దక్షిణ భారతంలో మురుగన్ నివాసం వరకు అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. దేశాన్ని విడగొట్టే ధైర్యం, సాహసం ఎవరికైనా ఉందని తాను అనుకోననని ఆయన తెలిపారు. రాజకీయ వైరుధ్యాలతో దేశాన్ని ముక్కలు చేయవద్దని, డీలిమిటేషన్పై చర్చ పెట్లాలని కోరడం తప్పులేదని, కానీ రూపీ సింబల్ మార్చుతామని చెప్పడం ఎంత కరెక్ట్ అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.