నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేస్తాడని జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ క్యాడర్ కు ఉన్న విశ్వాసం. దాన్ని నిజం చేస్తూ ఇటీవల సినీ నటుడు ఆలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పదవిని కట్టబెట్టారు. తాజాగా ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత, పోసాని మురళీకృష్ణ నియమిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
గత కొంత కాలంగా పోసాని మురళీకృష్ణ మౌనంగా ఉన్నారు. జనసేనాని పవన్ మీద కామెంట్ల చేసిన క్రమంలో ఏడాది క్రితం ఆయన ఇంటి మీద దాడి జరిగింది. ఆ తరువాత పెద్దగా న్యూస్ ఛానళ్లకు దూరంగా ఉంటున్నారు. పలు అంశాలు సినిమా ఇండస్ట్రీకి తాకినప్పటికీ ఆయన నోరుమెదపలేదు. కానీ, ఆయన సేవలను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి కీలక పదవిని పోసానికి అప్పగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పోసాని నియామకానికి సంబంధించి గురువారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
గత వారం హాస్య నటుడు అలీని రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహదారుగా నియమించుకున్న సంగతి తెలిసిందే. అలీ నియమకం జరిగిన రోజుల వ్యవధిలోనే పోసానికి కూడా కీలక పదవి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. అలీ మాదిరే పోసాని కూడా 2019 ఎన్నికలకు ముందే వైసీపీలో చేరారు. వైసీపీ భావజాలంతో పాటు సీఎం జగన్ వాదనలను బలంగా సమర్ధిస్తూ వస్తున్న పోసానికి ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ పదవి దక్కడం గమనార్హం.