క్రిస్టియన్, బీసీ, ఎస్సీ, మైనార్టీ సంఘాలు బ్రదర్ అనిల్ వెంట ఉన్నారా? 2019 ఎన్నికల్లో అతను చెబితేనే జగన్ కు ఓటు వేశారా? ఆయా వర్గాలకు జగన్ చేసిన అన్యాయం ఏమిటి? ఎందుకు బ్రదర్ అనిల్ నేరుగా జగన్ ను లక్ష్యంగా చేసుకుంటున్నాడు? షర్మిల తెలంగాణ కోడలిగా ఫోకస్ అవుతోంది. ఆంధ్రా అల్లుడుగా బ్రదర్ అనిల్ ను ప్రజలు ఆదరిస్తారా? అసలు జగన్, అనిల్ మధ్యా ఏం జరుగుతుంది? వైఎస్ సతీమణి విజయమ్మ ఎటు వైపు? అల్లుడు వైపు నడుస్తుందా? కుమారుడు కావాలని అనుకుంటుందా? ఇప్పుడు అసలైన ఛాలెంజ్ విజయమ్మను వెంటాడుతోంది.వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం విజయమ్మ రాజకీయాలకు దూరంగా ఉండేది. గృహిణిగా ప్రజలకు తెలుసు. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించిన తరువాత రాజకీయ వారసునిగా జగన్ తెరమీదకు వచ్చాడు. ఆనాటి నుంచి ఆమెకు రాజకీయ కష్టాలు వచ్చాయి. స్వర్గీయ వైఎస్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఆమె గెలిచింది. ఉమ్మడి అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే కాదు, కన్నీటి పర్యంతం అవుతూ స్పీచ్ ఇచ్చింది. ఆనాడు కాంగ్రెస్ సభ్యులు బొత్సా లాంటి వాళ్లు విజయమ్మను కించపరుస్తూ మాట్లాడారు. క్రమంగా ఆమె రాజకీయంగా రాటుతేలింది.
జగన్ జైలుకు వెళ్లినప్పుడు వైసీపీని నడిపించింది. జగనన్న బాణం అంటూ షర్మిలను ఓదార్పు బరిలోకి దింపింది. పాదయాత్రను ఆమె చేత చేయించింది. 2014 ఎన్నికల్లో విశాఖ ఎంపీగా ఆమె వైసీపీ తరపున పోటీ చేయాల్సిన అనివార్య పరిస్థితి వచ్చింది. కానీ, అక్కడ నుంచి ఆమె ఓడిపోయింది.ప్రతిపక్ష నాయకునిగా జగన్ ఉన్నాడు. ఆనాడు టీడీపీ పెట్టిన ఇబ్బందులను తట్టుకుంటూ వైసీపీని ముందుకు తీసుకెళ్లడంలో కుటుంబం సమేతంగా విజయమ్మ ఆధ్వర్యంలో పనిచేశారు. 2019 ఎన్నికల్లో అధికారం రావడానికి బ్రదర్ అనిల్ పాత్ర చాపకింద నీరులా క్రిస్టియానిటీ బాగా పనిచేసింది. షర్మిల తెగువ జగన్ కు కలిసొచ్చింది. విజయమ్మ ధీన వ్యాఖ్యలు జగన్ జీవితాన్ని మార్చేసింది. ఫలితంగా ఆయన సీఎం అయ్యాడు. అప్పటి నుంచి కొంత కాలం పాటు కుటుంబం ఐక్యంగా ఉంది. ఏడాదిన్నర తిరగకుండానే కుటుంబంలో అధికార విభేదాలు ఆస్తి తగాదాల వరకు వచ్చిందని తెలుస్తోంది. ఆ క్రమంలో వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిలకు అండగా విజయమ్మ నిలిచింది.
ప్రస్తుతం షర్మిల వెన్నంటి ఉంటోన్న విజయమ్మ తెలంగాణ ప్రజలకు కనిపిస్తోంది. రాజన్న రాజ్యం కోసం ఆదరించాలని ప్రజలను అభ్యర్థిస్తోంది. బ్రదర్ అనిల్ మాత్రం ఇటీవల వరకు మౌనంగా ఉన్నాడు. కానీ, ఏపీలో రాజకీయ పార్టీకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు. మూడు నెలలుగా వివిధ వర్గాలతో ఆయన భేటీ అవుతున్నాడు. తొలుత చర్చి ఫాదర్లతో రహస్యంగా మూడు నెలల క్రితం మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ తరువాత వైఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉండే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయ్యాడు. గత వారం క్రిస్టియన్, మైనార్టీ, ఎస్సీ, బీసీ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించాడు. ఏపీ సీఎం జగన్ అన్యాయం చేస్తున్నాడని బ్రదర్ ఎదుట వాళ్లు గగ్గోలు పెట్టారట. ఆ విషయాన్ని అనిల్ చెబుతూ కొత్త పార్టీ పెట్టడానికి అనుకూల సంకేతాలు ఇచ్చాడు. అంతేకాదు, జగన్ తో డైరెక్ట్ అటాక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. వైఎస్ బతికున్న రోజుల్లో జగన్ కంటే కుమార్తె షర్మిలకు అధిక ప్రాధాన్యం ఉండేదట. అలాగే ఇప్పుడు కూడా షర్మిలకు అన్యాయం జరిగిందని విజయమ్మ భావిస్తోందని తెలుస్తోంది. అందుకే, విజయమ్మ అల్లుడు బ్రదర్ అనిల్ వైపు నిలిచే అవకాశం ఉందని టాక్. మొత్తం మీద అల్లుడు, కొడుకు మధ్య విజయమ్మ నలిగిపోతోంది. ఆమె తీసుకునే నిర్ణయంపై అటు జగన్ ఇటు బ్రదర్ అనిల్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని పలువురు భావిస్తున్నారు.