రాష్ట్ర, రాజకీయ ప్రయోజనాలను వేర్వేరుగా చూడలేం. అందుకే, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి సర్కార్ వ్యతిరేక ఓటును చీలిపోకుండా చేస్తానంటూ జనసేనాని పవన్ ఆ పార్టీ ఎనిమిదో ఆవిర్భావ సభలో చెప్పారు. ఆ తరువాత పరిణామాలు చకచకా మారిపోయాయి. ఆ క్రమంలో మూడు ఆప్షన్లను తెరమీదకు తీసుకొచ్చారు.తాజాదా 50-50 సీఎం షేరింగ్ అంటూ జనసేన కొత్త ఈక్వేషన్ అందుకుంది. ఆ పార్టీ వాలకాన్ని గమనించిన చంద్రబాబు జనసేన పార్టీ ప్రస్తావన దాదాపుగా కోల్డ్ స్టోరేజిలో పడేశారు. బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు.
రాజ్యాధికారాన్ని బలంగా కోరుకుంటోన్న పవన్ ఎలాగైనా టీడీపీతో పొత్తుకు తహతహలాడుతున్నారు. ఇప్పటి వరకు జనసేన పార్టీకి గుర్తింపు లేదు. కేవలం రిజిస్ట్రర్ పార్టీ అయినప్పటికీ రాజ్యాధికారం కావాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న జనసేన మళ్లీ టీడీపీతో జత కట్టాలని వ్యూహం పన్నింది. లేదంటే, కనీస గెలుపు పవన్ కు కూడా సాధ్యం కాదని లోలోన మథనపడుతోందని ఆ పార్టీ వర్గాల్లోని టాక్. అందుకే, ఏదో ఒక విధంగా టీడీపీకి దగ్గర కావాలని యోచిస్తోంది.
రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము వేదికగా బీజేపీ, టీడీపీ ఒకే చోట కనిపించాయి. అంతేకాదు, వారం క్రితం ప్రధాని మోడీ, చంద్రబాబు ఏకాంత చర్చలు జనసైన్యంకు ఏ మాత్రం బోధపడడంలేదు. రెండేళ్లు బీజేపీ, జనసేన ఒక వేదికపైకి వచ్చిన దాఖలాలు లేవు. పైగా పలుమార్లు పవన్ కల్యాణ్ ను అవమానపడేలా బీజేపీ వ్యవహరించింది. తాజాగా చంద్రబాబు విజన్ ను ప్రశంసిస్తూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడారు. ఇవన్నీ గమనిస్తే, బీజేపీ, టీడీపీ కలిసి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జనసేన దారెటు అనేది ప్రశ్న.
సెప్టెంబర్ 12న ఆ మూడు పార్టీలు ఒకే వేదిక మీదకు రావడానికి ముహూర్తం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆ రోజున అమరాతి ఉద్యమానికి 1000 రోజులు అవుతోంది. విధాన పరంగా మూడు పార్టీలు అమరావతి విషయంలో ఒకేలా ఉంది. అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో సెప్టెంబర్ 12వ తేదీన జరిగే బహిరంగ సభను అమరావతి జేఏసీ నేతలు పెద్ద ఎత్తున చేయనున్నారు. ఆ సభకు బీజేపీ, టీడీపీ, జనసేన చీఫ్ లకు జేఏసీ ఆహ్వానం పంపింది. వైసీపీ మినహా అన్ని పార్టీల అధినేతల హాజరకు జేఏసీ హామీ పొందింది. ఆ సభ ద్వారా మూడు పార్టీలు ఒకే వాయిస్ ను వినిపించడం ద్వారా పొత్తు సంకేతాలు ఇవ్వడానికి సిద్ధం అవుతున్నాయి. అయితే, అదే సభకు కమ్యూనిస్ట్ లు , కాంగ్రెస్ హాజరు కూడా ఉంది. దీంతో ఎలాంటి రాజకీయ మలుపు ఆ సభ ఏపీ రాజకీయాలను తిప్పనుందో చూడాలి.