Site icon HashtagU Telugu

Kadambari Jethwani Case : జత్వాని కేసులో పోలీసుల ముందస్తు బెయిల్ విచారణ వాయిదా!

Kadambari Jethwani Case

Kadambari Jethwani Case

అమరావతి: ముంబై నటి జెత్వానీ కేసులో (Kadambari Jethwani Case) పోలీసు అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో (AP HighCourt) విచారణ జరిగింది. కేసు తాజాగా సీఐడీకి అప్పగించడంతో, కౌంటర్లు వేసేందుకు సమయం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు అభ్యర్థించారు. కేసు పూర్తయ్యే వరకు పోలీసు అధికారులకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంచాలని పిటిషనర్‌ల తరపున న్యాయవాదులు కోరారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కేసు తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.

నటి జెత్వానీ కేసు విచారణను సీఐడీకి అప్పగించేందుకు డీజీపీ ద్వారకా తిరుమలరావు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును విజయవాడ పోలీసులు దర్యాప్తు చేస్తున్న సమయంలో, సీనియర్ పోలీసు అధికారులు నిందితులుగా ఉండటంతో, ముంబై లింక్‌ల నేపథ్యంలో సీఐడీకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో ప్రథమ నిందితుడైన కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, అప్పటి విజయవాడ సీపీ క్రాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని, దర్యాప్తు అధికారి సత్యనారాయణ ముందస్తు బెయిల్ కోసం హైకోర్ట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు.

వైసీపీ హయాంలో కుక్కల విద్యాసాగర్ జెత్వానీపై ఫిర్యాదు చేయడంతో, ఆమెను విమానంలో విజయవాడకు తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో, తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయడం ద్వారా ఇబ్బందులకు గురి చేశారని జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను కూడా అరెస్టు చేశారని జెత్వానీ పోలీసులుకు తెలిపారు. పారిశ్రామికవేత్తపై ఫిర్యాదు చేసిన కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసిన తర్వాత, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ముంబై వచ్చి తనతో పాటు తల్లిదండ్రులను అరెస్టు చేయడం కుట్రగా ఉందని ఆమె పేర్కొంది.

పీఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వంలో తనను అక్రమంగా నిరబంధించారని జెత్వానీ పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదులో, విశాల్ గున్ని ద్వారా తన పూర్వాపరాలు, ముంబైలోని నివాసం వంటి అంశాలపై ఆరా తీయించడం జరిగినట్లు తెలిపారు. జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కుక్కల విద్యాసాగర్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కేసు జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఆయన పరారవడంతో, పోలీసులు ముమ్మరంగా గాలించి గత నెలలో విద్యాసాగర్‌ను అరెస్ట్ చేశారు. డెహ్రాడూన్‌లో విద్యాసాగర్‌ను అరెస్టు చేసిన పోలీసులు, విజయవాడ 4వ ఏసీఎంఎం జడ్జి ముందు హాజరుపరచారు.

ఈ కేసులో ఐపీఎస్ అధికారులైన పీఎస్ఆర్ ఆంజనేయులు, క్రాంతి రాణా, విశాల్ గున్నీ కూడా కీలకంగా ఉన్నారు. పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం, ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. అధికార దుర్వినియోగ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.