Site icon HashtagU Telugu

PM Internship Scheme 2024: శిక్షణతో సహా ఏడాదికి రూ.60,000, ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

PM Internship Scheme

PM Internship Scheme

PM Internship Scheme 2024: కేంద్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల వ్యవధిలో కోటి మంది యువతకు ఏడాదికి రూ. 60,000 ఆర్థిక సహాయం అందించే ఇంటర్న్‌షిప్ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. 2024-25లో చేపట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ యొక్క మొత్తం వ్యయం రూ.800 కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో 1.25 లక్షల మంది యువతకు ఇంటర్న్‌షిప్‌ను అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కేంద్ర బడ్జెట్ 2024లో ప్రకటించిన విధంగా, టాప్ కంపెనీలలో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. ఈ పథకం కింద ఇంటర్న్‌లకు బీమా కవరేజీ కూడా అందించబడుతుంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఈ స్కీమ్ అమలు చేయబడుతుంది. 21 నుండి 24 సంవత్సరాల వయస్సు ఉన్న యువత ఈ పథకానికి అర్హులుగా పరిగణించబడుతుంది. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ డిసెంబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పోర్టల్ ద్వారా, భాగస్వామ్య సంస్థలు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించవచ్చని పేర్కొంది.

ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం టాప్ కంపెనీలను గత మూడేళ్లలో వారి CSR ఖర్చుల ఆధారంగా గుర్తించినట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి. ఇంటర్న్‌షిప్ అవకాశాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు అక్టోబర్ రెండో వారం నుంచి పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు.

ప్రతి సంవత్సరానికి రూ.60,000 ఆర్థిక సహాయం మరియు బీమా కవరేజీ:

ఈ పథకంలో కంపెనీలు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. యువతకు 12 నెలల పాటు ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందించబడతాయి. తరగతి గదిలో కాకుండా, ప్రాక్టికల్ శిక్షణ అందించడం పై దృష్టి ఉంటది. ఏ కంపెనీ, బ్యాంకు లేదా ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదంతో ఈ పథకంలో భాగస్వామ్యం చేసుకోవచ్చు.

టాప్ 500 కంపెనీల ప్రాతినిధ్యం వహించని రంగాలు, ప్రాంతాలు మరియు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇంటర్న్‌లకు నెలకి రూ.5,000 ఆర్థిక సహాయం అందించబడుతుంది; ఇందులో రూ.4,500 కేంద్ర ప్రభుత్వం అందిస్తుంటుంది, కాగా కంపెనీ రూ.500 చెల్లిస్తుంది.

ఇంటర్న్‌షిప్‌లో చేరిన తర్వాత, ప్రతి ఇంటర్న్‌కు ఇన్‌సిడెంట్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.6,000 గ్రాంట్ పంపిణీ చేస్తుంది. ఈ పథకంలో ఇంటర్న్‌ల శిక్షణ ఖర్చులను కంపెనీలు తమ CSR నిధుల నుంచి ఉపయోగించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలు, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన మరియు పీఎం సురక్ష బీమా యోజన కింద ప్రతి ఇంటర్న్‌కు బీమా కవరేజీ అందించబడుతుంది, దీనికి సంబంధించిన ప్రీమియం కేంద్ర ప్రభుత్వమే కడుతుంది.

పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ 2024 కి అర్హతలు:

ఆన్‌లైన్ / దూరవిద్య ప్రోగ్రామ్‌లలో నమోదుకల్గి ఉన్న అభ్యర్థులు, హైస్కూల్ మరియు హయ్యర్ సెకండరీలో ఉత్తీర్ణులైనవారు, ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉన్నవారు, పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందినవారు, లేదా బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎ, బీఫార్మా డిగ్రీలు కలిగిన వారు అర్హులుగా పరిగణించబడతారు.

కంపనీలు ఆన్‌లైన్ పోర్టల్‌లో ప్రత్యేక డాష్‌బోర్డ్‌ను కలిగి ఉంటాయి, ఇందులో ఇంటర్న్‌షిప్ అవకాశాలను పోస్ట్ చేస్తారు. వారు స్థానాలు, అవసరమైన అర్హతలు మరియు సౌకర్యాలను పంచుకుంటారు. అర్హత గల అభ్యర్థులు ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. అభ్యర్థులు గరిష్టంగా ఐదు విభాగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ:

అభ్యర్థులు ఆన్‌లైన్ పోర్టల్ pminternship.mca.gov.in లో దరఖాస్తు చేసుకోవడం ద్వారా అవకాశం పొందవచ్చు. అక్టోబర్ 12 నుండి 25 వరకు వారు ఈ పోర్టల్‌లో తమ వివరాలను నమోదు చేయవచ్చు. దరఖాస్తుదారులను అక్టోబర్ 26 న షార్ట్‌లిస్టు చేయనున్నారు.