Perni Nani : ఎవ‌రిది అబ‌ద్ధం! బీమ్లాకు ‘అఖండ’ ముడి!!

సినీ హీరో నంద‌మూరి బాల‌క్రిష్ణ ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడ‌తాడు. లోప‌ల ఏమీ దాచుకోకుండా బ‌ర‌స్ట్ అవుతాడ‌ని టాలీవుడ్ కు తెలుసు.

  • Written By:
  • Publish Date - February 26, 2022 / 01:22 PM IST

సినీ హీరో నంద‌మూరి బాల‌క్రిష్ణ ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడ‌తాడు. లోప‌ల ఏమీ దాచుకోకుండా బ‌ర‌స్ట్ అవుతాడ‌ని టాలీవుడ్ కు తెలుసు. ఎదుటి వాళ్లు ఏమ‌నుకున్నా..మొఖానే చెప్పేసే నైజం బాల‌య్య‌కు ఉంద‌ని చాలా మంది చెబుతుంటారు. కానీ, అఖండ సినిమా విష‌యంలో బాల‌క్రిష్ణ నాలుక మ‌డ‌తేశాడ‌ని ఆల‌స్యంగా వెలుగుచూస్తోంది. ఏపీ సమాచార, సినిమాటోగ్ర‌ఫీ మంత్రి పేర్ని నాని అస‌లు విష‌యం చెప్పే వ‌ర‌కు బాల‌య్య అఖండ విడుద‌ల సంద‌ర్భంగా చేసిన ప్ర‌య‌త్నాలు ర‌హ‌స్యంగా ఉండిపోయాయి. సినిమా ధ‌ర‌లు, ఆన్ లైన్ టిక్కెట్ల విక్ర‌యానికి సంబంధించి జీవో నెంబ‌ర్ 35 పై చ‌ర్చించ‌డానికి జ‌గ‌న్ ర‌మ్మ‌న్నా రానంటూ ఆ మ‌ధ్య బాల‌య్య ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడు. అంద‌రూ నిజ‌మ‌ని అనుకున్నారు. అభిమానులు కూడా శ‌భాష్ బాల‌య్య అంటూ మెచ్చుకున్నారు. అఖండ విజ‌యంతో బాల‌య్య క్రేజ్ అమాంతం పెరిగింది. కానీ, జ‌గ‌న్ భేటీ విష‌యంలో బాల‌య్య చెప్పింది అబ‌ద్ధ‌మ‌ని మంత్రి పేర్ని నాని చెప్ప‌డంతో అఖండ మ‌రోసారి రాజ‌కీయ తెర‌మీద‌కు వచ్చింది.

మంత్రి పేర్ని నాని చెప్పిన దాని ప్ర‌కారం..అఖండ సినిమా విడుద‌ల‌కు ముందు జ‌గ‌న్ అపాయిట్మెంట్ కోసం బాల‌య్య ప్ర‌య‌త్నం చేశాడు. అందుకోసం ఇద్ద‌రు ప్రొడ్యూస‌ర్లు నూజివీడు ఎమ్మెల్యే ద్వారా మంత్రిని సంప్ర‌దించారు. ఆ మేర‌కు సీఎం జ‌గ‌న్ వ‌ద్ద అపాయిట్మెంట్ గురించి మంత్రి ప్ర‌స్తావించాడు. ఎందుకోసం అంటూ జ‌గ‌న్ ప్ర‌శ్నించాడు. అఖండ సినిమా విడుద‌ల గురించి చ‌ర్చించ‌డానికి అంటూ మంత్రి చెప్పాడు. త‌న వ‌ద్ద‌కు వ‌స్తే బాల‌య్య‌కు ఉన్న క్రేజ్ త‌గ్గుతుంది..ఆయ‌న‌కు ఏమి కావాలో..మీరే చూడండి అంటూ జ‌గ‌న్ ఆదేశించాడ‌ని మంత్రి నాని స్వ‌యంగా శుక్ర‌వారం మీడియాకు చెప్పాడు. ఇదంతా నిజం కాద‌ని బాల‌య్యను చెప్ప‌మ‌నండ‌ని విలేక‌రుల‌ను ప్ర‌శ్నించాడు. అంతేకాదు, బాల‌య్య ముహూర్తాల‌ను చూసుకుని మాట్లాడిన విష‌యాన్ని కూడా మంత్రి ప్ర‌స్తవించాడు. బాల‌య్య అబ‌ద్దాలు చెప్ప‌డ‌ని న‌మ్ముతున్నానంటూ నాని ముక్తాయించాడు.

అయిపోయిన పెళ్లికి మేళం మాదిరిగా ఇప్పుడు మంత్రి పేర్ని నాని ఎందుకు అఖండ‌ను సీన్లోకి లాగాడు? అంటే..టాప్ హీరోలు జ‌గ‌న్ ను క‌లిసిన‌ప్ప‌టికీ ధ‌ర‌ల‌ను స‌వరిస్తూ ఎందుకు జీవో ఇవ్వ‌లేద‌ని మీడియా ప్ర‌శ్నించింది. అంతేకాదు, ఉద్దేశ పూర్వ‌కంగా బీమ్లా నాయ‌క్ ను ఏపీ ప్ర‌భుత్వం ఎందుకు టార్గెట్ చేసింద‌ని వేసిన ప్ర‌శ్న‌కు బ‌దులుగా అఖండ‌ను మంత్రి సీన్లోకి లాగాడు. ఆ సినిమా విడుద‌ల అయిన రోజున ఏ నిబంధ‌న‌లు ఉన్నాయో..ఇప్పుడు కూడా అవే నిబంధ‌న‌లు ఉన్నాయ‌ని వివ‌రించాడు. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా కోసం ప్ర‌త్యేకంగా ఎలాంటి నిబంధ‌న‌ల‌ను ఏపీ సర్కార్ తీసుకురాలేద‌ని చెప్పాడు. `ప్ర‌స్తుతం జీవో నెంబ‌ర్ 35 మీద హైకోర్టు డైరెక్ష‌న్ ఉంది. థియేట‌ర్ల యాజ‌మాన్యాలు జాయింట్ క‌లెక్ట‌ర్ జారీ చేసే నిబంధ‌న‌ల ప్ర‌కారం సినిమాను ప్ర‌ద‌ర్శించాలి. జీవో నెంబ‌ర్ 35ను స‌వ‌రించుకునేందుకు ప్ర‌త్యేక క‌మిటీని హైకోర్టు సూచ‌న మేర‌కు ఏపీ స‌ర్కార్ ఏర్పాటు చేసింది. ఆ క‌మిటీ ఇచ్చిన సూచ‌న‌ల మేర‌కు కొత్త జీవో ఇవ్వ‌డానికి స‌ర్కార్ సిద్థంగా ఉంది. ఈనెల 24వ తేదీన ధ‌ర‌ల‌ను పెంచుతూ కొత్త జీవో ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం భావించింది. హ‌ఠాత్తుగా మంత్రి గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణించ‌డంతో జీవోను విడుద‌ల చేయ‌లేక పోయింది. అంటే, పాత జీవోను అమ‌లు చేయాల్సిన బాధ్య‌త అధికారుల‌పై ఉంటుంది.` అదే చేశామ‌ని మంత్రి వివ‌రించాడు. బీమ్లానాయ‌క్ ను అడ్డుకోవాల్సిన అవ‌స‌రం జ‌గ‌న్ స‌ర్కార్ కు లేద‌న్నాడు.

వాస్త‌వంగా టిక్కెట్ల ధ‌ర‌ల నియంత్ర‌ణ‌కు సంబంధించిన జీవో 35పైన చ‌ర్చించ‌డానికి ఇటీవ‌ల‌ ప్ర‌భాస్‌, మ‌హేష్ బాబు లాంటి వాళ్ల‌తో క‌లిసి మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లిలోని జ‌గ‌న్‌ను క‌లిశాడు. ఆ సంద‌ర్భంగా చిరంజీవి రెండు చేతులు జోడిస్తూ చేసిన అభ్య‌ర్థ‌న టాలీవుడ్ ను క‌దిలిచింది. టాప్ హీరోలు కోరిన విధంగా ఈనెల 25లోపు కొత్త జీవో ఇస్తామ‌ని ప్ర‌భుత్వం నుంచి హామీ ఇచ్చింది. అందుకే, బీమ్లా నాయ‌క్ సినిమాను ఈనెల 25న విడుద‌ల చేయాల‌ని నిర్ణ‌యించారు. కానీ, కొత్త జీవో రాక‌పోవ‌డంతో బీమ్లా నాయ‌క్ ను టార్గెట్ చేయ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ చేసిన ప‌న్నాగ‌మంటూ ప‌వ‌న్ అభిమానులు భావించారు. దానికి క్లారిటీ ఇవ్వ‌డానికి అఖండ సినిమాను మంత్రి పేర్ని నాని సీన్లోకి లాగాడు.
అప్ప‌ట్లో సీఎం జగన్‌తో భేటీకి సంబంధించి నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సీఎం జగన్‌ను రాజకీయంగా, హిందూపురం కోసం మాత్రమే కలుస్తానని తేల్చి చెప్పాడు. సినిమా టికెట్ రేట్ల విషయంలో మాత్రం ముఖ్యమంత్రిని కలిసే ఆలోచన లేద‌ని వెల్ల‌డించాడు. కానీ, సినిమా టిక్కెట్ల కోసం జ‌గ‌న్ తో భేటీ కావ‌డానికి ప్ర‌య‌త్నం చేశాడ‌ని మంత్రి పేర్ని నాని చెబుతున్నాడు. ఆ క్ర‌మంలో బాల‌య్య అబ‌ద్ధం ఆడాడా? మంత్రి అబ‌ద్ధం చెప్పాడా? అనే దానిపై టాలీవుడ్ లో చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిపై బాల‌య్య నోరుతెరిస్తే అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డనుంది. అప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్ లోనే కాదు, రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ ఈ చ‌ర్చ ఆగే అవ‌కాశం లేదన్న‌మాట‌.