జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈనెల 15వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నాయకులు, పార్టీ వాలంటీర్లతో సమావేశం కానున్నారు. 16వ తేదీన విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆయా జిల్లాల నుంచి ప్రజా సమస్యలపై వచ్చే వినతులను పవన్ కల్యాణ్ స్వీకరించనున్నారు. 15, 16, 17 తేదీల్లో ఉమ్మడి విశాఖపట్నం, ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లా నాయకులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ నాయకులకు, శ్రేణులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఇప్పటికే వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు పవన్ కల్యాణ్. ఉత్తారంధ్ర వైసీపీ లీడర్లు రాజీనామాలపై చేస్తున్న ప్రకటలపై విరుచుకుపడ్డారు. వైసీపీ మూడు రాజధానుల నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఎందుకోసం వైసీపీ గర్జనలు అంటూ ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయటానికా? ‘సంపూర్ణ మద్య నిషేధం’ అద్భుతంగా అమలు చేస్తున్నందుకా? ఇసుకను అడ్డగోలు దోచుకొంటున్నందుకా? అని పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.