Pawan Kalyan : ఈసారి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పవన్ ఉండబోయే భవనాన్ని చేబ్రోలుకు చెందిన ఓదూరి నాగేశ్వరరావు నిర్మిస్తున్నారు. పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉండేలా దీన్ని రెడీ చేయిస్తున్నారు. ఈ ఇంటికి శుక్రవారం రోజే గృహప్రవేశం కూడా పూర్తయింది. ప్రస్తుతం ఇది తుదిమెరుగులు దిద్దుకుంటోంది. ఇంటికి సమీపంలోనే పంటపొలాల్లో హెలిప్యాడ్ ఏర్పాటు పనులు కూడా మొదలయ్యాయి. పిఠాపురాన్ని స్వస్థలంగా మార్చుకుంటానని ప్రకటించిన జనసేనాని.. ఈ ఇంట్లో ఉండేందుకు రెడీ అవుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఈనెల 9న చేబ్రోలులోని ఈ కొత్త ఇంట్లోనే ఈసారి పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు.ఉగాది వేడుకల్లో పాల్గొనేందుకు పిఠాపురానికి పవన్ రానుండటంతో.. అప్పటిలోగా ఈ ఇంటిని రెడీ చేసి ఇక్కడే కార్యక్రమాన్ని నిర్వహించాలని జనసేన పార్టీ నేతలు నిర్ణయించారు. చేబ్రోలు బైపాస్ రోడ్డు పక్కన తన పంటపొలాల్లో రైతు ఓదూరి నాగేశ్వరరావు మూడు అంతస్తుల భవనాన్ని కట్టుకున్నారు. ఇందులోనే ఉంటూ పవన్ కల్యాణ్ స్థానికంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. ఎన్నికల్లో గెలిస్తే ఇక్కడే సొంతింటిని నిర్మించుకుంటానని పవన్ అంటున్నారు.
ఈ ఇంట్లో గ్రౌండ్ఫ్లోర్ను వాహనాల పార్కింగ్కు కేటాయిస్తారు. ఫస్ట్ ఫ్లోర్ను ఆఫీసుకు వాడుకుంటారు. మిగతా రెండు, మూడు అంతస్తులను కలిపి డ్యూప్లెక్స్ తరహాలో నిర్మించారు. ఓదూరి నాగేశ్వరరావు పవన్ అభిమాని కావడంతో ఇంటిని ఇచ్చేందుకు అంగీకరించినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. తనకు ఇంటి అద్దె వద్దని, కేవలం ఒక రూపాయి ఇస్తే చాలని ఆయన చెప్పినట్టు సమాచారం.