Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల్లో టీడీ-జేఎస్-బీజేపీ కూటమి విజయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విశ్వాసం వ్యక్తం చేశారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 130 స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం గుడివాడ, రేపల్లెలో జరిగిన బహిరంగ సభల్లో జనసేనాని మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తున్నందున ఎన్డీఏ విజయం సాధిస్తుందని ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, స్పందన ఆధారంగా ఒక అవగాహనకు వచ్చామని చెప్పారు.
పవన్ ఇలా వ్యాఖ్యలు చేయటంతో కూటమికి ఎంత మెజారిటీ వస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా సీఎం వైఎస్ జగన్పై ఆయన విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక వాగ్దానాలను వైసీపీ తుంగలో తొక్కిందని ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం.. దశలవారీగా మద్య నిషేధాన్ని ఎందుకు అమలు చేయడం లేదని, కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు.
Also Read: Soldier Killed: జమ్ము కాశ్మీర్ పూంచ్ సెక్టార్ వద్ద జరిగిన ఉగ్రదాడిలో జవాన్ మృతి
ప్రత్యర్థులపై దాడి చేసి వారిపై దౌర్జన్యం చేసే ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వమని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఎన్టీయార్ లాంటి మహనీయుడిని గౌరవించేలా జగన్ రెడ్డి ప్రభుత్వం నాటి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిందని అన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్గా మార్చాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.
We’re now on WhatsApp : Click to Join
ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే నా ప్రాధాన్యత అని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల స్వేచ్ఛను కాపాడాతా. మేము మీ ఓట్ల కోసం కాదు.. ఏపీని రక్షించడానికి, అభివృద్ధి చేయడానికి, ప్రజలకు సంక్షేమం అందించడానికి ఇక్కడకు వచ్చానని అన్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో పొందుపరిచిన పథకాల శ్రేణిని ప్రకటించిన జనసేన అధినేత, రాష్ట్ర ప్రభుత్వం కాలువలను పూడిక తీయడం లేదని, రాష్ట్రంలో ఇతర అభివృద్ధి పనులను చేపట్టడం లేదని విమర్శించారు. అంతకుముందు, రేపల్లెలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ.. ప్రజలలో ఇంత క్రేజ్ ఒకప్పుడు ఎంఎస్ ధోనీకి ఉండేది. ప్రస్తుతం మళ్లీ అలాంటి క్రేజే పవన్ కల్యాణ్ దగ్గర చూస్తున్నాను అని అన్నారు. ప్రజలకు మేలు చేసేందుకే రాజకీయ పార్టీని స్థాపించిన నిజమైన హీరో పవన్ కళ్యాణ్ అని, మీ క్రేజ్ను ఓట్ల రూపంలోకి మార్చుకుని ఆయనకు మద్దతు ఇవ్వాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని అంబటి రాయుడు అన్నారు.