స్వర్గీయ ఎన్టీఆర్ టీడీపీ స్థాపించినప్పుడు రాజకీయాల్లో ప్రవేశించిన తరం దాదాపుగా ఖాళీ కానుంది. ఆ గ్యాప్ ను 2024 ఎన్నికల్లో పూరించే ఫార్ములాను తీసుకుంటానని ఒకానొక సందర్భంలో జనసేనాని పవన్ చెప్పారు. బహుశా ఆ దిశగా ఆలోచిస్తోన్న పవన్ ఆనాడు ఎన్టీఆర్ వాడిని `చైతన్య రథం` నమూనాకు కొంచెం ఆధునికతను జోడిస్తూ ప్రత్యేక వాహనాన్ని డిజైన్ చేయిస్తున్నారు. ఆయన యాత్రకు ప్రత్యేక వాహనం ముస్తాబవుతోంది.
మూడు రోజుల విశాఖ పర్యటనకు బయలుదేరిన పవన్ శుక్రవారం ప్రత్యేకవాహనాన్ని పరిశీలించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా హల్ చల్ చేస్తున్నాయి. కనీసం ఆరుగురు కూర్చుని చర్చించుకునేలా కన్వెట్టబుల్ సిట్టింగ్ రూమ్ ప్రత్యేక వాహనంలో ఉంది. అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో 360 డిగ్రీల నిఘా నేత్రంతో సీసీ కెమెరాలను ఫిట్ చేస్తున్నారు. హై సెక్యూరిటీ సిస్టమ్ విత్ జీపిఎస్ ట్రాకింగ్ ఉండేలా డిజైన్ చేశారు. వాహనం టాప్ పైకి పవన్ చేరేందుకు లోపల నుండే పవర్ లిఫ్ట్ సిస్టమ్ ఏరేంజ్ చేస్తున్నారు. ప్రజలతో మాట్లాడేటప్పుడు పవన్ ప్రజలందరికి కనిపంచేలా సరికొత్త డిజైన్ చేశారు. లేటెస్ట్ సౌండ్ సిస్టం, లైటింగ్ సిస్టం ఫిట్ చేస్తున్నారు.
మిలటరీ కి చెందిన రంగును ఈ వాహనానికి వాడబోతున్నారు. ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ `చైతన్య రథం`కు వాడిన రంగు ప్రత్యేక వాహనానికి వేయబోతున్నారు. వాహనానికి తుది మెరుగులు దుద్దుతున్నారు. వాహనం బాడీకి రెండు వైపులా గార్డులు నిలబడే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ యాత్ర రథాన్ని ప్రత్యేకంగా రూపొందిస్తుండడంతో దీనిని ఎప్పుడు చూస్తామా అనే ఆసక్తి పవన్ అభిమానుల్లోనూ, జనాల్లోనూ నెలకొంది.
వాస్తవంగా అక్టోబర్ 5 విజయ దశమి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర ఉంటుందని తొలుత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు ఉంటాయన్నదానిపై క్లారిటీ లేకపోవడంతో పవన్ సినిమా షూటింగ్ ల్లో బిజీ అయ్యారు. ఎన్నికలపై క్లారిటీ వచ్చిన తరువాత ఆరు నెలల పాటు ప్రజల్లోనే ఉండేలా పవన్ జిల్లాల పర్యటన ఉండనుంది. అందుకోసం పవన్ కళ్యాణ్ వాడే వాహనం ఎన్టీఆర్ వాడిన చైతన్య రథాన్ని పోలి ఉండడం హైలెట్ గా నిలుస్తోంది. హైదరాబాద్లో ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది.