Pawan kalyan : ఏపీలో బీజేపీ పరిస్థితి ఏమిటి? ఆ పార్టీ జనసేనతో పొత్తులో ఉందా? చంద్రబాబును జైలుకు పంపడంపై ఎందుకు సైలెంట్ గా ఉంది? ఇలాంటి ప్రశ్నలకు కమలం పార్టీ వేదిక అయింది. ఆ పార్టీతో ఎవరు పొత్తుకున్నా మునిగిపోయే ప్రమాదం ఉందని తాజా సర్వేల సారాంశం. అందుకే, వ్యూహాత్మకంగా బీజేపీని పవన్ కల్యాణ్ పక్కనపడేశారు. కానీ, కమలనాథులు మాత్రం ఇప్పటికీ జనసేనాని వెంట ఉన్నామంటూ మభ్యపెడుతున్నారు.
తొలి నుంచి బీజేపీ, జనసేన పొత్తు హాస్యాస్పదంగా ఉంది. ఢిల్లీ బీజేపీతో మాత్రమే తన పొత్తు అంటూ పవన్ చెబుతారు. రాష్ట్రంలో కలిసి నడిచేందుకు సిద్దమని పలుమార్లు ఆయన చెప్పారు. కానీ, బీజేపీ మాత్రం ఆయన్ను పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణ వేదికపై దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఇక ఏపీ రాజకీయ వేదికపై పవన్ గ్లామర్ ను వాడేసుకోవడానికి ప్రయత్నం జరుగుతోంది. కానీ, సీఎం జగన్మోహన్ రెడ్డిని కాదని ఏమీ చేయలేని పరిస్థితిలో ఏపీ బీజేపీ ఉందని సర్వత్రా వినిపిస్తోంది. ఫలితంగా ఎటూకాకుండా కమలం పార్టీ ఉందని (Pawan kalyan)అర్థమవుతోంది.
Also Read : Chandrababu Quash Petition : చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా
ప్రతిపక్ష నేత చంద్రబాబును జైలుకు పంపిన తరువాత బీజేపీ గ్రాఫ్ ఏపీలో బాగా పడిపోయిందని ఆ పార్టీలోని వాళ్లే చెప్పుకుంటున్నారు. వ్యూహాత్మకంగా చంద్రబాబు జైలు, అరెస్ట్ ల మీద మౌనంగా ఉండడం కమలనాథులకు మైనస్ పాయింట్ గా ఉంది. అదే విషయాన్ని అధిష్టానం వద్ద చెప్పినప్పటికీ పెద్దగా స్పందన లేదని తెలుస్తోంది. పైగా ఏపీ బీజేపీలోని నాయకులు చంద్రబాబును జైలుకు పంపడంపై వ్యక్తిగతంగా భిన్నాభిప్రాయాలను వెలుబుచ్చుతున్నారు. తొలుత ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి ఖండించినప్పటికీ ఆ తరువాత సైలెంట్ అయ్యారు. ఆ పార్టీకి చెందిన ఎంపీ జీవీఎల్ మాత్రం చంద్రబాబును జైలుకు పంపించడాన్ని సమర్థించారు.
మాజీ సీఎం చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లిన తరువాత జరిగిన పరిణామాల క్రమంలో బీజేపీతో పొత్తును దాదాపుగా పవన్ (Pawan kalyan)తెంచుకున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్రకటించారు. కలిసొస్తే ఓకే, లేదంటే బీజేపీని దిలేస్తా అన్నట్టు పరోక్ష సంకేతాలు ఇచ్చారు. దీంతో ఆ పార్టీని దాదాపుగా టీడీపీ, జనసేన పక్కన పెట్టేసిందని చెప్పొచ్చు. ఆ స్థానంలో ఉభయ కమ్యూనిస్ట్ లను కలుపుకుని వెళ్లడానికి టీడీపీ-జనసేన సిద్ధంగా ఉన్నాయని తెలుస్తోంది. కామ్రేడ్లతో కూటమి కలిసొచ్చే అవకాశం ఉందని సర్వేల అంచనా.
తొలి నుంచి పవన్ ను పలు అవమానాలకు బీజేపీ గురి చేసింది. ఎప్పుడూ ఆ రెండు పార్టీలు ఒక వేదికపైకొచ్చి కనిపించలేదు. పైగా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక తరువాత పొత్తు ప్రహసనంగా మారింది. ఆ తరువాత జరిగిన బద్వేల్, ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఎవరిదోవ వాళ్లదే అన్నట్టు ఆ రెండు పార్టీల లీడర్లు వ్యవహరించారు. చివరకు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరణకు కూడా పవన్ కల్యాణ్ ను ఆహ్వానించలేదు. ఇంతకంటే అవమానం ఆ పార్టీకి మరొకటి ఉండదు. అందుకే, వ్యూహాత్మకంగా పవన్ పక్కన పెట్టేశారని అర్థమవుతోంది. ఇక చంద్రబాబు జైలుకు వెళ్లిన తరువాత బీజేపీ, జనసేన (Pawan kalyan)మధ్య గ్యాప్ ఎక్కువ అయింది. కానీ, ఏపీలోని కమలనాథులు మాత్రం ఏదోలా జనసేనతో కలిసి వెళ్లాలని చూస్తోంది. తాజా సర్వేలను గమనించిన తరువాత బీజేపీతో ఎవరు కలిసినా మునిగిపోవడం ఖాయమంగా కనిపిస్తోంది. అంటే, బీజేపీతో పూర్తిగా కటీఫ్ కావడమే పవన్ తక్షణ కర్తవ్యంగా ఉందని సర్వత్రా వినిపిస్తోంది.
Also Read : KTR: మా మూడు ప్రధాన హామీల సంగతేంటి మోడీజీ, ప్రధానిపై కేటీఆర్ ఫైర్!