జనసేన పార్టీ- యువ శక్తి బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అధికార పార్టీ వైసీపీపై మండిపడ్డారు. ఈ సభలో అనేక అంశాలపై వివరణ ఇచ్చారు. ఈ సభలో చంద్రబాబుతో భేటీపై పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. రెండు గంటలు ఏం మాట్లాడుకున్నారు అని గింజుకుంటున్నారు. విశాఖలో మాకు సంఘీభావం తెలిపినందుకు, కుప్పం ఘటనతో ఆయనకు మద్దతుగా నిలిచేందుకు వెళ్లాను. కొంతసేపు సంబరాల రాంబాబు గురించి చర్చించాం. సన్నాసి ఐటీ మినిస్టర్ రాష్ట్రాన్ని 15వ స్థానంలో పెట్టాడని మాట్లాడుకున్నాం. లా అండ్ ఆర్డర్ అంశాలపై చర్చించాంఅని వెల్లడించారు.
అలాగే పొత్తులపై కీలక ప్రకటన చేశారు. ఒంటరిగా అధికారంలోకి వస్తామనే భావన కలిగించే బాధ్యత జనసైనికులదేనని చెప్పారు. అలా లేకుంటే శత్రువును ఎదుర్కొనేందుకు కలిసి పని చేయాల్సిందేనని అన్నారు. పదేళ్లు అధికారం లేకున్నా ప్రజల కోసం ఒంటరిగా నిలబడ్డానని గుర్తు చేశారు. హింసించే వాడిని ఎదుర్కోవాలంటే అందరూ కలవాల్సిందేనన్నారు. గౌరవం తగ్గకుండా కుదిరితేనే పొత్తు, లేదంటే ఒంటరిగానే పోటీ ఉంటుందని తెలిపారు.
ఈ క్రమంలోనే ఏపీ సీఎంపై పవన్ కల్యాణ్ సెటైర్ వేశారు. ఇక్కడున్నది మూడు ముక్కల ముఖ్యమంత్రి. రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని కుట్ర చేస్తున్నారు. మీ నాన్ననే ఎదుర్కొన్నా, నువ్వెంత. సంబరాల రాంబాబులు, డైమండ్ రాణీలు ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. బూతులు తిట్టే మంత్రులు, బెదిరించే గూండాలకు ఎలా అడ్డుకట్ట వేయాలో నాకు బాగా తెలుసు అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రతీ వెధవ, సన్నాసి చేత తాను తిట్లు పడాల్సి వస్తోందని అన్నారు. అదే తాను సినిమాల్లో ఉంటే ఆ వెధవలే తనతో ఫొటో దిగేవారని చెప్పారు. ఆ వెధవలు, సన్నాసులతో మాటలు పడకుండా జీవించే బతుకు తనకు ఉందనీ, కానీ ప్రజల కోసం మాటలు పడుతున్నానని తెలిపారు. తాను కుల నాయకుడిని కాదనే విషయం గుర్తుంచుకోవాలని అధికార పక్షానికి పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు.
Also Read: Bomb in Plane: విమానానికి బాంబు బెదిరింపు కాల్..అలర్ట్ అయిన అధికారులు
ఉత్తరాంధ్ర ప్రజలకు యువశక్తి సభా వేదిక నుంచి పవన్ కల్యాణ్ కీలక హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే వలసలను ఆపేస్తామని చెప్పారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. మత్సకారుల సమస్యలు తీరుస్తామని వెల్లడించారు. ప్రజల కోసం తాను ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమేనని తెలిపారు. తాను ఎప్పుడైనా తెలుగు ప్రజలు, దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తినని చెప్పారు. కులాల ఐక్యత ఒక్క కాపు కులం కాదన్నారు. రాజకీయంగా ఓడిపోయినా పర్వాలేదు కానీ, కులాల కుంపట్లు పెట్టడం తనకు ఇష్టం లేదని వెల్లడించారు. వైసీపీ మాత్రం ఒకే కులంతో నిండిపోయిందని విమర్శించారు.
వారాహితో బస్సు యాత్ర ఆపేది లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వారాహితో వస్తాం, రెడీగా ఉంది.. ఎవడు ఆపుతాడో చూస్తా. మీరు బెదిరిస్తే భయపడేది లేదు. పదవిలో ఉన్న మీకే అంత ఉంటే బాధలు పడుతున్న వాళ్లం మాకెంత ఉండాలి. 151 మంది మీరు వస్తే.. మేం కోట్లాది మంది ఉన్నాం అని వైసీపీ నేతల మాటలకు కౌంటర్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, నాగబాబు సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
హైపర్ ఆది సెటైర్లు
ఏపీ మంత్రులపై బుల్లితెర నటుడు హైపర్ ఆది సెటైర్లు విసిరారు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో నిర్వహించిన జనసేన ‘యువశక్తి’ సభలో ఆది మాట్లాడుతూ.. మంత్రులకు శాఖలు ఎందుకని.. జనసేనాని పవన్ని తిట్టే శాఖ ఒకటి పెట్టుకోండని ఎద్దేవా చేశారు. పవన్ ప్రేమకే లోంగుతాడు కానీ, ప్యాకేజ్కు కాదని పేర్కొన్నారు. జనాల కోసం ఉన్నాడు కాబట్టే జనసేనానిగా ఉన్నాడని, విసిగిస్తే వీరమల్లు బయటకు వస్తాడని చెప్పారు.