ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Andhra Deputy CM Pawan Kalyan) కార్యాలయానికి బెదిరింపు ఫోన్ కాల్స్ (Death Threat Call) రావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. పవన్ కళ్యాణ్ ను చంపేస్తామంటూ ఆ వ్యక్తి ఫోన్ ద్వారా హెచ్చరించడమే కాకుండా, అభ్యంతరకర సందేశాలు పంపినట్టు సమాచారం. ఈ విషయాన్ని పవన్ కార్యాలయ సిబ్బంది ఆయన దృష్టికి తీసుకెళ్లి పోలీసులకు సమాచారం అందించారు.
ఈ సంఘటనపై హోంమంత్రి అనిత (Home Minister Anita) స్పందించారు. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుండి వచ్చిందో..త్వరగా కనుక్కోవాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిందితుడిని పసిగట్టడం, అతన్ని అదుపులోకి తీసుకోవడం కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని హోంమంత్రి హెచ్చరించారు. మంత్రి అనిత సూచనలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
కృష్ణలంక పోలీసులు ఈ ఘటనలో కీలక ఆధారాలను సేకరించారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి విజయవాడ (Vijayawada) లబ్బీపేట(Labbipet)లోని వాటర్ ట్యాంక్ రోడ్ (Water Tank Road)వద్ద నివాసం ఉంటున్న మల్లికార్జున్ (Mallikarjun) అని నిర్ధారించారు. అతని ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేసే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. తదుపరి విచారణలో, మల్లికార్జున్ ఫోన్ స్విచాఫ్ అయినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ప్రస్తుతం అతని లోకేషన్ తెలుసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అతన్ని త్వరలో అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఈ ఫోన్ కాల్ తో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉద్రిక్తత నెలకొంది. పవన్ కల్యాణ్ భద్రతపై మరింత నిఘా పెట్టాలని అధికారులు నిర్ణయించారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. పవన్ కల్యాణ్ ఇటీవల రేషన్ మాఫియాపై ఉక్కుపాదం మోపిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడమే కాదు ఓ భారీ షిప్ ను సైతం సీజ్ చేయించాడు. ఈ ఘటనల అనంతరం పవన్ కు బెదిరింపు కాల్స్ రావడంతో పోలీసులు ఈ కోణంలో దర్యాప్తు చేసే అవకాశం ఉంది.
Read Also : Captain Pat Cummins : బంతి ఏదైనా టీమిండియాకు కళ్లెం వేస్తున్న పాట్ కమిన్స్