ఎన్టీఆర్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ పేరును వైస్సార్ హెల్త్ సైన్స్ యూనివర్సిటీ గా మార్చడంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ పేర్లు మార్చడం ద్వారా పాలకులు ఏం సాధిస్తారని ఒక ప్రకటనలో ప్రశ్నించారు. అందుకు సహేతుకమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ పేరు బదులు వైఎస్సార్ పేరు పెడితే వర్సిటీలో వసతులు మెరుగవుతాయా అని అడిగారు. విద్యార్థులకు మౌలిక వసతుల కల్పన వదిలేసి పేర్లు మార్చడం అర్థం లేని చర్యగా పేర్కొన్నారు.ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకో, కొత్త వివాదాలు సృష్టించేందుకో వైసీపీ ప్రభుత్వం ఈ పని చేసినట్లుందన్నారు.
అంతగా అవసరమైతే విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి పేరు మార్చవచ్చు కదా అని అన్నారు. ఆ పేరు ఇంకా బ్రిటీష్ వాసనలతో ఉందని పేర్కొన్నారు. ప్రపంచప్రఖ్యాత వైద్య శాస్త్రజ్ఞునులలో ఒకరైన మన తెలుగువారు యార్లగడ్డ సుబ్బారావు పేరు ఒక్క సంస్థకైనా పెట్టారా అని ప్రశ్నించారు. ఇంట్లో వాళ్ల పేర్లు ప్రజల ఆస్తులకు పెట్టడంమేంటని నిదీశారు. ప్రజల కోసం జీవితాలను ధారపోసిన మహనీయుల పేర్లను ఎందుకు పెట్టరని పవన్ కళ్యాణ్ అడిగారు.