మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ ఇద్దరూ రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో వెళుతున్నారు. ఫలితంగా మెగా అభిమానులు, జనసేన్యం వేర్వేరుగా అనే విధంగా ప్రచారం జరుగుతోంది. ఆ గ్యాప్ ను పూడ్చడానికి పలుమార్లు నాగబాబు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం పెద్దగా లేకపోయింది. దీంతో నేరుగా పవన్ రంగంలోకి దిగినట్టు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవికి తాడేపల్లి ప్యాలెస్ లోని జరిగిన అవమానం జరిగిందని తెరమీదకు తీసుకొచ్చారు. అద్భుతమైన ఆతిథ్యం సీఎం జగన్ దంపతుల నుంచి లభించిందని మీడియాకు చిరంజీవి పలుమార్లు చెప్పారు. అంతేకాదు, రెండు,మూడుసార్లు చిరంజీవి, జగన్ పలు వేదికలపై భేటీ అయ్యారు. అభిమానాన్ని పరస్పరం పంచుకున్నారు. తాజాగా భీమవరం కేంద్రం అల్లూరి విగ్రహం ఆవిష్కరణ అందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
కేవలం ప్రైవేటు మీటింగ్ ల్లోనే కాదు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న విధాన నిర్ణయాలను కూడా చిరంజీవి శభాష్ అంటున్నారు. సినిమా టిక్కెట్ల ధరల విషయం జగన్మోహన్ రెడ్డి మానవీయంగా ఆలోచించారని కితాబు ఇచ్చారు. అంతేకాదు, సినిమా పరిశ్రమలను బతికించడానికి ఏపీ సీఎం చూపిన చొరవ అద్భుతం అంటూ ప్రశంసించారు. ఆచార్య సినిమాకు ప్రత్యేక అనుమతులు ఇవ్వడంపై జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కేవలం సినిమా విషయం మాత్రమే కాదు రాష్ట్రంలోని రాజధాని విషయంలోనూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని చిరంజీవి పలుమార్లు సమర్థిస్తూ మాట్లాడారు. మూడు రాజధానులు ఏపీకి అవసరమని చిరంజీవి చెబుతున్నారు. ముందుచూపుతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసించారు. కానీ, పవన్ మాత్రం చిరంజీవి ప్రశంసలకు భిన్నంగా ఒకే రాజధాని నినాదాన్ని వినిపిస్తున్నారు.
ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని జనసేనాని పవన్ స్లోగన్ అందుకున్నారు. మూడేళ్లుగా ఉద్యమం చేస్తున్న రాజధాని రైతులు సోమవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో కలిసినప్పుడు పవన్ కల్యాణ్ ఆ మేరకు హామీ ఇచ్చారు. రెండో విడత పాదయాత్రకు మద్దతు ఇవ్వాలని రైతులు కోరడంతో అక్కడికక్కడే స్పందించిన పవన్ కల్యాణ్ రాజధాని రైతుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
సెప్టెంబర్ 12 నుంచి నవంబర్ 14 వరకు అమరావతి నుంచి అరసవిల్లి వరకు రాజధాని రైతులు రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రలో పాలుపంచుకుంటానని హామీ ఇచ్చిన ఆయన అమరావతి అన్ని కులాల వారిదని అన్నారు. అమరావతి సమస్యలను పరిష్కరించకుండా 3 రాజధానుల పేరిట కొత్త సమస్యను సృష్టించారన్నారు. రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని, అది అమరావతే కావాలని పవన్ కూడి డిమాండ్ ను అందుకున్నారు. దీంతో అమరావతి విషయంలో పవన్, చిరంజీవి వేర్వేరు అభిప్రాయాలతో ఉన్నారని అర్థం అవుతోంది. ఇదే కాదు, పలు విషయాల్లో పవన్, చిరు మధ్య గ్యాప్ కనిపిస్తోంది. దాన్ని పూడ్చుకోవడానికి జనసేన నానా తంటాలు పడుతోంది.