ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం (AP Cabinet) ఫిబ్రవరి 6న ఉదయం 11 గంటలకు సచివాలయంలో నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరుకాలేకపోతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురికావడంతో ఆయన కేబినెట్ సమావేశానికి దూరంగా ఉంటారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ మధ్య ఎన్నికల ప్రచార సమయంలోనూ పవన్ కళ్యాణ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అంతేకాదు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లినప్పుడు కూడా జ్వరంతోనే దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం స్పాండిలైటిస్ సమస్యతో బాధపడుతున్న ఆయన పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
Chanakya Strategies : ఢిల్లీ ఎన్నికలపై ‘చాణక్య స్ట్రాటజీస్’ సంచలన ఎగ్జిట్ పోల్స్
ఈ కారణంగానే రేపు జరగబోయే కేబినెట్ సమావేశానికి పవన్ దూరంగా ఉంటున్నారు. ఆయన లేకుండానే చంద్రబాబు మంత్రివర్గ సమావేశాన్ని కొనసాగించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని కీలక అంశాలపై చర్చించనున్నారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఫ్రీ హోల్డ్ చేసిన భూముల వ్యవహారంపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం. అలాగే విశాఖ పంచగ్రామాల సమస్యలపై, స్టేట్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు ఆమోదించిన 15 ప్రాజెక్టులపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. అలాగే ఉచిత బస్సు ప్రయాణ హామీపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికను కూడా సమర్పించనున్నారు. ప్రభుత్వ బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఉన్నత విద్యా మండలికి ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు వంటి అంశాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వివిధ శాఖల పనితీరు, పాలనలో తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ముఖ్యమంత్రి మంత్రులతో సమాలోచనలు చేయనున్నారు.