Janasena : జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో ఏర్పాటు చేసిన ‘జయ కేతనం’ సభకు పార్టీ నాయకులు, జనసేన పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నాగబాబు మాట్లాడుతూ..పిఠాపురం ప్రజలు, జన సైనికులకు రుణపడి ఉన్నామని అన్నారు. నాకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన పవన్కు కృతజ్ఞతలు. జనసైనికుడిని అని చెప్పుకొనేందుకు గర్వ పడుతున్నా అన్నారు.
Read Also: Best Places In The World : అత్యుత్తమ ప్రాంతాల జాబితాలో రెండు భారత హోటళ్లు
ప్రజల బాగోగులు చూసే వ్యక్తి పవన్ కల్యాణ్. అలాంటి ఒక గొప్ప వ్యక్తిగా కావాలి.. లేకుంటే ఆయనకు అనుచరుడిగా ఉండాలి. వచ్చే రెండు, మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తి పవన్. దేవుడు అడిగితేనే వరాలిస్తాడు.. కానీ, ఆయన అడగకుండానే వరాలిస్తారని అన్నారు. నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో చూశాం. నోటిదురుసు ఉన్న నేతకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. రాజకీయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని పవన్ చెప్పారు. జగన్ లాంటి హాస్యనటులు ఎన్నో కలలు కన్నారు. మరో 20 ఏళ్ల వరకు జగన్ కలలు కంటూనే ఉండాలని నా సలహా అని నాగబాబు అన్నారు.
పిఠాపురంలో పవన్ విజయానికి తానే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి కర్మ అని నాగబాబు అన్నారు. అసలు పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయానికి రెండే కారణాలు అని అన్నారు. మొదటి ఫ్యాక్టర్ పవన్ కల్యాణ్ అయితే.. రెండోది జనసైనికులను చెప్పుకొచ్చారు. ఇంతకు మించి ఎవరైనా ఈ విజయం తమదే అని అనుకుంటే మాత్రం వాళ్ల ఖర్మ అని అన్నారు. పిఠాపురంలో పని చేయాలని పవన్ కల్యాణ్ తమను పంపించినప్పుడు చాలా సంతోషించామన్నారు నాగబాబు. అసలు అక్కడ పవన్ విజయానికి తిరుగులేదని పిఠాపురం వెళ్లిన తర్వాత అర్థమైందని అన్నారు.