జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ (Janasena Formation Day) వేడుకలు ఈసారి మరింత ప్రణాళికాబద్ధంగా జరిగాయి. అభిమానుల ఉత్సాహం, కేరింతలతో జరిగినప్పటికీ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రసంగంలో మాత్రం కొత్తదనం కనిపించకపోవడం పార్టీ శ్రేణులను నిరాశకు గురి చేసింది. గత పదకొండు ఏళ్లుగా చెబుతూ వస్తున్న విషయాలనే పునరావృతం చేయడంతో భవిష్యత్కు సంబంధించి పార్టీ స్పష్టమైన దిశా నిర్దేశం ఏమిటనేది కార్యకర్తలకు అర్థంకాని ప్రశ్నగా మిగిలింది. జనసేన పోరాట లక్ష్యాలు, పార్టీ విధానాల గురించి చెప్పాల్సిన సందర్భంలో పవన్ తన వ్యక్తిగత అనుభవాలను, కుటుంబ నేపథ్యాన్ని ఎక్కువగా ప్రస్తావించడం బోర్ కొట్టించింది.
Trump Vs 41 Countries : 41 దేశాలపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్.. భారత్ పొరుగు దేశాలపైనా..!!
ప్లీనరీ వేదిక అనేది కేవలం గుర్తుల్ని గుర్తు చేసుకోవడానికి కాకుండా భవిష్యత్ దిశలో పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్లాలనేది స్పష్టంగా తెలియజేయాల్సిన సమయం. అయితే జనసేన ప్లీనరీలో ఈ అంశాలపై చర్చకన్నా, పవన్ కల్యాణ్ చేసిన త్యాగాలు, ఆయన గొప్పతనం గురించిన ప్రసంగాలే ఎక్కువగా వినిపించాయి. నాగబాబు సహా ఇతర నేతలు పవన్ను పొగడడానికే ఎక్కువ సమయం వెచ్చించారు. పార్టీ ముందుకు తీసుకెళ్లే కార్యాచరణపై చర్చ జరగకపోవడం కార్యకర్తల్లో నిరాశ కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన నాయకులకు పరిచయ వేదికగా సభ మారిపోవడం గమనార్హం.
ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన-టీడీపీ కూటమిపై పవన్ చేసిన వ్యాఖ్యలు మిశ్రమ ప్రతిస్పందనలను తెచ్చాయి. పవన్ మాట్లాడుతూ “మేమే టీడీపీని నిలబెట్టాం” అన్న వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో అసంతృప్తిని రేకెత్తించాయి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా కలిసి పోటీ చేసి విజయం సాధించాయి. అలా అయితే జనసేన విజయం కూడా మిగతా పార్టీల సహకారంతో సాధ్యమైందన్న విషయం పవన్ గుర్తించాలి. భవిష్యత్లో కూటమిగా ముందుకు వెళ్లాలంటే పరస్పర అవగాహన అవసరం. కానీ పవన్ తన ప్రసంగంలో ఆ దిశగా ఏ స్పష్టమైన సంకేతాలు ఇవ్వకపోవడంతో, జనసేన భవితవ్యంపై అనేక అనుమానాలు నెలకొన్నాయి.