Poster Praveen Pagadala Case: పాస్టర్ ప్రవీణ్ పగడాలది కచ్చితంగా హత్యే, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఒక్క క్షణం బైబిల్ పక్కన పెడితే ఊచకోత కోస్తాం. మమ్మల్ని కెలకొద్దు, మేం మంచివాళ్ళం కాదు, మూర్ఖులం. మాతో పెట్టుకోకండి. ఖబడ్దార్ అంటూ రాజమహేంద్రవరం ఆసుపత్రి వద్ద జనాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి రెచ్చిపోయిన వైకాపా మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వైకాపా అధినేత జగన్ కుటుంబానికి సన్నిహితుడు బెన్ని లింగం ఇప్పుడు మాట మార్చారు. ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడిన ఆయనపై కేసు నమోదు చేసి, రాజానగరం పోలీసులు విచారణకు పిలవడంతో సోమవారం ఉదయం 11 గంటలకు హాజరు అయ్యారు.
నార్త్జోన్ డీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనను విచారించింది. ఆ రోజు జనాల్ని చూసి ఆవేశంలో మాట్లాడానని, మతవిద్వేషాలు రెచ్చగొట్టే ఉద్దేశం నాకు లేదని, పాస్టర్ను హత్య చేశారనడానికి తన వద్ద ఎటువంటి ఆధారాలు లేవని చెప్పినట్లు తెలిసింది. తన వీడియోను ఎడిట్ చేసి, మార్ఫింగ్ చేశారని కూడా ఆరోపించినట్లు సమాచారం. సాయంత్రం వరకు విచారించిన పోలీసులు ఆయన నుంచి స్టేట్మెంట్ తీసుకుని విడిచిపెట్టారు. ప్రవీణ్ మృతిపై ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని కోరామని సీఐ ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. అవసరమైతే మరోసారి హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు.