రాజధాని రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు సంఘీభావంగా వాషింగ్టన్ డీసీలో ప్రవాసాంధ్రులు ర్యాలీ నిర్వహించారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రైతులు ఉద్యమం మొదలుపెట్టి వెయ్యి రోజులు అవుతున్నసందర్భంగా రేపు వారు అమరావతి నుంచి అరసవల్లి వరకు పాదయాత్ర చేపట్టనున్న విషయం తెలిసిందే. వారి పాదయాత్రకు మద్దతు తెలుపుతూ వివిధ ప్రాంతాల నుంచి ప్రవాసాంధ్రులు, వారి తల్లిదండ్రులు తరలివచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అమరావతి రాజధాని వెయ్యి రోజులు అని పెద్ద బ్యానర్ పట్టుకుని ఈ ర్యాలీ నిర్వహించారు. రాజ్యాంగాన్ని గౌరవించండి- అమరావతిని నిర్మించండి, హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి, ఒన్ స్టేట్ ఒన్ కేపిటల్,అలుపెరుగని అమరావతి రైతుల పోరాటం… అని ప్లకార్డులు ప్రదర్శించారు.
న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలుచేయాలి, అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలి, అలుపెరగని ఉద్యమం, అమరావతి ఉద్యమం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ ర్యాలీలో మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, మన్నవ సుబ్బారావు, డాక్టర్ యడ్ల హేమప్రసాద్, భాను మాగులూరి, మన్నవ వెంకటేశ్వరరావు,సాయి బొల్లినేని, రామకృష్ణ ఇంటూరి, సత్య సూరపనేని తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ యూఎస్ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆన్ లైన్ అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీభావం తెలిపారు.