Tirumala Today : ఇవాళ తిరుమలలో కుమారధార తీర్థ ముక్కోటి జరగనుంది. ఇందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ఈరోజు ఉదయం 5.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కుమారధార తీర్థానికి భక్తులను అనుమతిస్తారు. అధికబరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. గోగర్భం నుంచి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ప్రైవేటు వాహనాలను అనుమతించరు. టీటీడీ అన్నప్రసాద విభాగం (Tirumala Today) ఆధ్వర్యంలో పాపవినాశనం డ్యామ్ వద్ద ఉదయం 6 గంటల నుంచి భక్తులకు పొంగళి, ఉప్మా, సాంబారన్నం, పెరుగన్నం, పాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు అన్నదానం చేసేందుకు అనుమతి లేదు. ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో భక్తుల కోసం షెడ్లు, మార్గం మధ్యలో నిచ్చెనలు, తాగునీటి కుళాయీలు ఏర్పాటు చేశారు. అంబులెన్స్లు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచారు.
We’re now on WhatsApp. Click to Join
టీటీడీ రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకరరెడ్డికి కృతజ్ఞతాసభ, ఆత్మీయ సన్మాన కార్యక్రమం శుక్రవారం తిరుపతిలో జరిగింది. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయ వేదపండితులు ఛైర్మన్ కు వేదాశీర్వచనం చేశారు.పేదవారికి సాయం చేయాలని తన చిన్నతనంలో తెలుగు మాస్టారు చెప్పిన మాటలు మనసులో నిలిచిపోయాయన్నారు. అప్పటినుంచి అదే ఆలోచనగా జీవిస్తున్నానని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు తొలిసారి టీటీడీ ఛైర్మన్ గా అవకాశం ఇచ్చిన తర్వాత పేదవారికి సాయం చేయాలన్న తన ఆలోచనలను ఆచరణలో పెట్టే అవకాశం లభించిందన్నారు. టీటీడీ ఛైర్మన్ పదవి ఎన్నో ఉత్కృష్ట పదవుల కంటే చాలా గొప్పదని తన భావన అని ఉద్యోగుల కరతాళధ్వనుల నడుమ తెలిపారు. ఉద్యోగులకు ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని అడగ్గానే సీఎం జగన్ అంగీకరించారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేనివిధంగా, వేలాది మంది ఉద్యోగులకు వందలాది ఎకరాల్లో ఇళ్లస్థలాలు ఇవ్వడం తన జీవితంలో మధురానుభూతిని మిగిల్చిందన్నారు.