సీఎం జగన్ తో సినీ నటుడు చిరంజీవి భేటీకి రాజకీయ రంగుపులుముకుంది. చిరంజీవి భేటి తరువాత సోషల్ మీడియాలో, మీడియాలో పలు ఊహాగానాలు వచ్చాయి. చిరంజీవికి వైసీపీ నుంచి రాజ్యసభ సీటు ఇస్తున్నారని జోరుగా ప్రచారం జరిగింది.
అయితే ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ తో్ భేటి తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ కోసమేనని ఆయన స్పష్టం చేశారు. సీఎం జగన్ ని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా,ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమడాన్ని ఖండించారు.
తనను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయని..అవన్నీ పూర్తిగా నిరాధారమని ఆయన అన్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న తాను మళ్ళీ రాజకీయాల్లోకి, చట్టసభలకు రావటం జరగదని ఆయన తేల్చి చెప్పారు. దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దని ఆయన కోరారు. ఈ వార్తలకి, చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.
తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం,థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా,ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.అవన్నీ పూర్తిగా నిరాధారం.
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 14, 2022