Union Minister of State for Rural Development and Communications Pemmasani Chandrasekhar : ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో మొబైల్ కనెక్టివిటీపై ఫోకస్ పెట్టింది. మొబైల్ సిగ్నల్స్ను మెరుగుపరిచేందుకు సిద్ధమైంది.. మారుమూల ప్రాంతాల్లో కూడా సిగ్నల్స్ వచ్చేలా ప్లాన్ చేస్తోంది. దీని కోసం కొత్తగా 707 టవర్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలను గుర్తించి ఈ టవర్లు ఏర్పాటు చేస్తారు. ‘డిజిటల్ భారత్ నిధి’ పథకం కింద ఈ వ్యాయాన్ని కేంద్రం భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ టవర్లకు అవసరమైన స్థలాన్ని ఇస్తుంది.
- ఏపీలో కొత్తగా మొబైల్ టవర్ల ఏర్పాటు
- ‘డిజిటల్ భారత్ నిధి’ పథకం కింద
- 707 టవర్లు ఏర్పాటు చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్లోని మారుమూల, గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ సిగ్నల్ సమస్యలకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. కొత్తగా 707 సెల్ టవర్లను ఏర్పాటు చేస్తోంది. ఈ సెల్ టవర్ల నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం ‘డిజిటల్ భారత్ నిధి’ పథకం ద్వారా భరిస్తుంది. అయితే, టవర్ల ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ వంటి సంస్థలు ఈ టవర్లను ఏర్పాటు చేస్తాయి. రాష్ట్రంలోని మారుమూల, ఏజెన్సీ ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ను మెరుగుపరచడానికి ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. సెల్ ఫోన్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో, ఉన్న టవర్లు సరిపోవడం లేదు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లో, అలాగే తరచుగా సిగ్నల్ సమస్యలు వచ్చే చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి, ప్రభుత్వం కొత్తగా టవర్లు నిర్మించాలని ఆలోచిస్తోంది. కొత్త టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి రెవెన్యూ శాఖకు చెందిన ఖాళీ స్థలాలతో పాటు, ఏజెన్సీ ప్రాంతాల్లోని అటవీ భూములు కూడా అవసరం అవుతాయి. కొన్ని చోట్ల టవర్ల నిర్మాణానికి అవసరమైన యంత్రాలు, సామగ్రిని తరలించడానికి సరైన రోడ్డు మార్గాలు కూడా లేవని అధికారులు గుర్తించారు. ఇది నిర్మాణ పనులకు అడ్డంకిగా మారుతోంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. ఈ జిల్లాలోని చాలా గిరిజన గ్రామాల్లో సెల్ ఫోన్ నెట్వర్క్ సరిగా పనిచేయడం లేదు. ఈ ఒక్క జిల్లాలోనే 100 కొత్త టవర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలో భాగంగా, అధికారులు ఇప్పటికే 42 ప్రదేశాలలో జాయింట్ సర్వేను పూర్తి చేశారు. మరో 13 స్థలాలను టవర్ల ఏర్పాటు కోసం సంబంధిత టెలికాం సంస్థలకు అప్పగించారు. ఈ చర్యల ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన కమ్యూనికేషన్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నారు.
రాష్ట్రంలో నెట్వర్క్ వాడకం బాగా పెరిగిపోయింది. దీంతో తరచూ సిగ్నల్ సమస్యలు వస్తున్న ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించింది. టవర్లు అందరికీ సరిపోవట్లేదు.. అందుకే, ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 4జీ సేవలను మెరుగుపరచడానికి 624 కొత్త టవర్లను ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేసింది. ఈ కొత్త టవర్లను ఎక్కడ ఏర్పాటు చేయాలో అధికారులు పరిశీలించారు. కొత్త జిల్లాల ఆధారంగా స్థలాలను గుర్తించారు. ఇప్పటికే 295 ప్రాంతాల్లో సర్వేలు పూర్తయ్యాయి. ఈ సర్వేల ఆధారంగా, 37 లొకేషన్లను టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ చర్యల వల్ల రాష్ట్రంలో సిగ్నల్ సమస్యలు తగ్గుతాయని ఆశిస్తున్నారు.
