నారావారిపల్లె లో రామ్మూర్తినాయుడి అంత్యక్రియలు (Nara Ramamurthy Naidu Funerals) ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి అయ్యాయి. ఏపీ సీఎం , టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు (Nara Ramamurthy Naidu) నిన్న(శనివారం) మధ్యాహ్నం హైదరాబాద్లో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈరోజు(ఆదివారం) ఉదయం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో ఆయన పార్థివదేహాన్ని నారావారిపల్లెకు తీసుకొచ్చారు.
చంద్రబాబు తో పాటు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, నారా లోకేశ్, బ్రాహ్మణి, సినీ నటులు మోహన్ బాబు, మంచు మనోజ్, పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు నివాళి అర్పించిన అనంతరం అంతిమ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్రలో వేలాదిగా పార్టీ శ్రేణులు , కుటుంబ సభ్యులు , నారా , నందమూరి అభిమానులు , ప్రజలు హాజరయ్యారు. ప్రభుత్వ అధికార లాంఛనాలతో తల్లిదండ్రులు అమ్మణ్నమ్మ, ఖర్జూర నాయుడు సమాధుల పక్కనే రామ్మూర్తి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియల్లో రామ్మూర్తి నాయుడు సోదరుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
రామ్మూర్తి నాయుడు మృతితో ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. నారా రామ్మూర్తినాయుడు 1952లో నారా ఖర్జూరనాయుడు, అమ్మణ్ణమ్మ దంపతులకు జన్మించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రామ్మూర్తి సోదరుడు. నారా రామ్మూర్తి నాయుడు ఎస్వీ ఆర్ట్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ బీఏ చేశారు. 1992 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన రామ్మూర్తి, 1994లో టీడీపీ తరఫున చంద్రగిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన తరువాత రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
2003లో అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సమక్షంలో దిల్లీలో రామ్మూర్తినాయుడు ఆ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అధిష్టానం 2004లో శ్రీకాళహస్తి నుంచి పోటీ చేయాలని ఆదేశించడంతో ఆయన విభేదించారు. అనంతరం చంద్రగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
Read Also : Dhanush VS Heroine Nayanatara : మీరు మారండి ..అంటూ ధనుష్ ను ఉద్దేశించి విఘ్నేశ్ ట్వీట్..