టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర రెండో రోజు 8.30 గం.లకు ప్రారంభంకానుంది. కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం అవుతుంది. పాదయాత్రలో గుడుపల్లె మండలం బెగ్గిపల్లెలో గ్రామస్తులతో నారా లోకేష్ సమావేశంకానున్నారు.కడపల్లెలో టీడీపీ సీనియర్ నేతలను కలిసి వారి ఆశీర్వాదం తీసుకోనున్నారు. అనంతరం కనుమల దొడ్డిలో ప్రజల నుంచి వినతుల స్వీకరించి వారితో మాట్లాడనున్నారు. కనుమలదొడ్డిలో భోజన విరామం, పార్టీ నేతలతో సమావేశం అనంతరం.. తుమ్మిశి చెరువు సమీపంలో పలమనేరు – కుప్పం జాతీయ రహదారి పక్కన రాత్రి బస చేయనున్నారు.
తొలిరోజు పాదయాత్రకు భారీగా టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. 175 అసెంబ్లీల ఇంఛార్జ్లు, రాష్ట్ర స్థాయి నేతలతో పాటు గ్రామ స్థాయిలో నేతలు కూడా కుప్పం తరలివెళ్లారు. అనకున్న మూహుర్తానికి నారా లోకేష్ పాదయాత్ర తొలి అడుగు వేశారు. భారీ జనసందోహం మధ్య లోకేష్ యువగళం పాదయాత్ర సాగింది. సాయంత్రం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు భారీగా ప్రజలు హాజరైయ్యారు. ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై లోకేష్ మాట్లాడారు. ప్రజల సమస్యలపై టీడీపీ రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు రాలేదనే నిరాశతో 300 మంది యువత ఆత్మహత్యలకు పాల్పడ్డారని.. జె ట్యాక్స్ కోసం వేధింపులు తీవ్రం కావడంతో రిలయన్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ , హోలీ టెక్, మెగా సీడ్ పార్క్, అమరరాజా కూడా పక్క రాష్ట్రాలకు తరలిపోయాయని ఆయన ఆరోపించారు.