టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర పీలేరు నియోజకవర్గంలో జరుగుతుంది. 35వ రోజు యాత్రలో దారిపోడవునా లోకేష్కి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పీలేరు సభలో ప్రజలను ఉద్దేశించి నారా లోకేష్ ప్రసంగించారు. వెంగమాంబ పుట్టిన ఈ పీలేరు గడ్డపై తాను పాదయాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నానని లోకేష్ తెలిపారు. ఒక్క ఛాన్స్…ఒక్క ఛాన్స్..అని ముఖ్యమంత్రి అయిన జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని.. ఒక్క ఛాన్స్ వల్ల మన జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదన్నారు. పిచ్చోడి చేతిలో రాయిపెట్టినట్లు మన రాష్ట్ర పరిస్థితి తయారైందన్నారు. యువగళం పాదయాత్ర ప్రారంభించిన నాటి నుండి జగన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదని.. తన పాదయాత్రను ఎలా అడ్డుకోవాలి అంటూ స్కెచ్ వేస్తున్నారని తెలిపారు. వెయ్యి మంది పోలీసులు, ఆరుగురు డీఎస్పీలు, 20మంది సీఐలు, ఇంటెలిజెన్స్ అధికారులు… ఒక్క లోకేష్ ను ఆపడానికి ఇంత మంది అవసరమా? అంటూ ఆయన ప్రశ్నించారు. 400రోజులు మీ మధ్యే ఉంటా…ఎవరాపుతారో చూస్తానంటూ సవాల్ చేశారు.