ప్రభుత్వ వ్యతిరేకులను ఏపీ పోలీస్ టార్గెట్ చేస్తోంది. ఒక సీఐడీ సోషల్ మీడియాలోని ప్రత్యర్థులను కట్టడీ చేస్తుంటే మరోవైపు సివిల్ పోలీసులు టీడీపీ క్యాడర్ ను లక్ష్యంగా చేసుకుంది. గత మూడేళ్లుగా అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. తాజాగా సీఐడీ టీడీపీ సోషల్ మీడియా వింగ్ కో ఆర్డినేటర్ నరేంద్రను అరెస్ట్ చేసి ముప్పుతిప్పలు పెట్టింది. కడప జిల్లా ప్రొద్దుటూర్ టీడీపీ ఇంచార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇలాంటి పరిస్థితుల్లో క్యాడర్ కు వెన్నుతట్టి ధైర్యం చెప్పడానికి లోకేష్ ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో మంగళవారం కడప జిల్లా జైల్లోని ప్రవీన్ కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు వెళ్లారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఘన స్వాగతం లభించింది. ఉదయం జిల్లా ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయనకు స్వాగతం పలికేందుకు భారీ సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గాన కడప సెంట్రల్ జైలుకు ర్యాలీగా లోకేష్ ను తీసుకెళ్లారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్ కుమార్ రెడ్డిని లోకేష్ పరామర్శించారు. పార్టీ నేతలతో కలిసి సెంట్రల్ జైలుకు వెళ్లారు.
లోకేష్ టూర్ లో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా కొందరు టీడీపీ నేతలు, ద్వితీయశ్రేణి లీడర్లకు ముందస్తు నోటీసులు జారీ చేశారు. లోకేష్ పర్యటనలో ఉద్రిక్తతలు తలెత్తితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కడప చేరుకున్న నారా లోకేష్ తొలుత జిల్లా ముఖ్య నేతలు, ఇంఛార్జులతో భేటీ అయ్యారు. జిల్లాలో తాజా రాజకీయ పరిణామాల పై చర్చించారు. అనంతరం విమానాశ్రయం నుండి కడప సెంట్రల్ జైలుకి వెళ్లారు. సీఎం జగన్ అడ్డాలోనూ లోకేష్ కు లభించిన ఆదరణ కడప టీడీపీలో జోష్ పెంచింది.