Nara Bhuvaneshwari : కొన్ని నెలల క్రితం జరిగిన చంద్రబాబు అరెస్ట్ ఒక్కసారిగా రాజకీయ పరిణామాల్ని మార్చేసింది. అనూహ్యంగా నారా భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘నిజం గెలవాలి’ పేరుతో నిర్వహించిన యాత్ర ఆమెలోని రాజకీయ కోణాన్ని ఆవిష్కరించింది. చంద్రబాబు అరెస్టు కారణంగా మనస్థాపానికి గురైన ప్రాణాలు విడిచిన కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా భువనేశ్వరి చేసిన పర్యటన టీడీపీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపింది. ‘నిజం గెలవాలి’ యాత్రతో వచ్చిన కాన్ఫిడెన్స్ తో .. మరో యాత్ర చేసేందుకు నారా భువనేశ్వరి రెడీ అవుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని మహిళల్ని ఆకట్టుకునే అవకాశాలు ఉండటంతో తెలుదేశం పార్టీ నాయకత్వం కూడా నారా భువనేశ్వరిని ఎన్నికల ప్రచారం దిశగా ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే చంద్రబాబు, లోకేష్లతో పాటు నారా భువనేశ్వరి కూడా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనే అవకాశం ఉందని అంటున్నారు. టీడీపీకి క్రౌడ్ పుల్లర్స్ గా ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వంటి వారు ఉన్నారు. ఇప్పుడు భువనేశ్వరి కూడా ఆ జాబితాలో చేరితే మహిళా ఓటర్లను ఈజీగా ఆకట్టుకోవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join
ఇప్పటికిప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నారా భువనేశ్వరికి(Nara Bhuvaneshwari) లేకపోయినా.. భవిష్యత్ లో ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో చెప్పలేం. ప్రజాప్రతినిధిగా, ఎన్టీఆర్ బిడ్డగా, చంద్రబాబు సతీమణిగా ప్రజల మన్నన్నల్ని ఆమె పొందుతారని టీడీపీ నేతలు భావిస్తున్నారు. భువనేశ్వరి సోదరి పురందేశ్వరి ఇప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కీలకమైన స్థానంలో ఉన్నారు. చంద్రబాబు రాజకీయాల్లో ఉంటే.. భువనేశ్వరి హెరిటేజ్ కంపెనీని వృద్ధిలోకి తీసుకొచ్చారు.ఎన్టీఆర్ ట్రస్ట్ బాధ్యతలను చూసుకున్నారు. ఇటీవల నారా బ్రహ్మణి హెరిటేజ్ బాధ్యతల్ని పూర్తి స్థాయిలో తీసుకున్నారు. ఆ సంస్థను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. దీంతో భువనేశ్వరి కాస్త తీరికగా ఉన్నారు. అందుకే ఈసారి ఆమెతో ఎన్నికల ప్రచారం చేయిస్తే టీడీపీకి కలిసొస్తుందని భావిస్తున్నారు.
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే నిజం గెలవాలి యాత్రను నారా భువనేశ్వరి ప్రారంభించారు. మొదట చిత్తూరు జిల్లాలో తర్వాత ఉత్తరాంధ్రలో పర్యటించారు. ఉత్తరాంధ్రలో పర్యటన ప్రారంభించినప్పుడే చంద్రబాబునాయుడుకు బెయిల్ రావడంతో యాత్రను తాత్కలికంగా ఆపేశారు. కాస్త విరామం తర్వాత అన్ని జిల్లాలు పర్యటించారు. ఆమె చేసింది రాజకీయ పర్యటనలు కాదు..కానీ అక్కడి ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగాలు సంపూర్ణ అవగాహనతో .. స్పష్టతతో ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది.