Mudragada Padmanabham Letter to CBN : కాపు ఉద్యమ నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేశ్లను లక్ష్యంగా చేసుకుని చేసిన సంచలన విమర్శలు ఏపీ రాజకీయాల్లో వేడిని పెంచాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాపు సామాజికవర్గం ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఘాటైన లేఖ రాశారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉద్దేశపూర్వకంగా కాపు నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో తన కుటుంబాన్ని అనేక అవమానాలకు గురిచేశారని గుర్తు చేస్తూ, ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు ద్వారా మరో కాపు కుటుంబాన్ని వేధిస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం ఒక నిర్దిష్ట సామాజికవర్గానికి చెందిన నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని ముద్రగడ ఈ లేఖలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారం మరియు ఇతర ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి అరెస్టులు చేస్తున్నారని ముద్రగడ ఆరోపించారు. ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేయడం చంద్రబాబుకు అలవాటేనని ఆయన మండిపడ్డారు. రాజకీయాల్లో విమర్శలు సహజమని, కానీ వ్యక్తిగత కక్షలతో కుటుంబాలను రోడ్డుపైకి లాగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ముఖ్యంగా కాపు సామాజికవర్గం నుంచి వస్తున్న గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
Ambati Rambabu Remand
ఇదే క్రమంలో గత ఎన్నికల ఫలితాలపై ముద్రగడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో కాపులపై జరిగిన దాడుల వల్ల చంద్రబాబుపై ఆ సామాజికవర్గానికి తీవ్ర కోపం ఉన్నప్పటికీ, కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్న ప్రేమతోనే కాపులందరూ కూటమికి మద్దతిచ్చారని ఆయన గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ అండ లేకపోతే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే వారు కాదన్న అర్థంలో ఆయన వ్యాఖ్యలు సాగాయి. అధికారం ఇచ్చి గెలిపించిన సామాజికవర్గానికే ఇప్పుడు అన్యాయం చేస్తున్నారని, ఈ ధోరణి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని ముద్రగడ హెచ్చరించారు.
