కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) అనారోగ్యంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స (Treatment)పొందుతున్నారు. శనివారం ఆయనకు శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తడంతో తొలుత కాకినాడలోని అహోబిలం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం రాత్రి 10.30కి మెడికవర్ ఆసుపత్రి(Medicover Hospital)కి మార్పు చేశారు. ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు స్పష్టం చేశారు. అభిమానులు ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
ముద్రగదపై అనారోగ్యం సంబంధించి గతంలో పలు పుకార్లు రావడంతో ఆయన కుమారుడు గిరిబాబు స్పందిస్తూ.. “నాన్నగారి ఆరోగ్యం నిలకడగా ఉంది. మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవ వార్తలను నమ్మవద్దు. కుటుంబం తరఫున ఆయనకు తగిన విధంగా వైద్యం అందిస్తున్నారు” అని స్పష్టం చేశారు. కొద్ది రోజుల క్రితమే ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ తన ఆరోగ్యం బాగానే ఉందని, వయసు వల్ల కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కుమారుడు గిరిబాబు మెరుగైన వైద్యం అందిస్తున్నారని తెలిపారు. అయితే చాలా కాలంగా బయటకు రాకపోవడం వల్ల ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు చెలరేగాయి.
ముద్రగదకు క్యాన్సర్ ఉందని ఆయన కుమార్తె ముద్రగడ క్రాంతి ఆరోపిస్తున్నారు. తండ్రికి తగిన వైద్యం అందడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ముద్రగడ మాత్రం తన కుమార్తెతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పారు. “నన్ను చూసేందుకు రావాల్సిన అవసరం లేదు. నా కుమారుడు నా ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ చూపుతున్నాడు” అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలతో కుటుంబ విభేదాలు మళ్లీ వెలుగులోకి వచ్చాయి.
ముద్రగద కుటుంబంలో రాజకీయ విభేదాలు ఉధృతమయ్యాయి. ఒకవైపు ముద్రగడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా, ఆయన కుమార్తె క్రాంతి జనసేనలో చేరారు. దీనికి తోడు ముద్రగద తన వియ్యంకులతో కూడా సంబంధాలు తెంచుకున్న విషయం తెలిసిందే. ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుటుంబ సమైక్యత కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, కుటుంబంలో ఉన్న పాత విభేదాలు ప్రస్తుతం మరింత చర్చనీయాంశంగా మారుతున్నాయి.