AP Politics: ఎంపీ రేసులో సినీ నటుడు అలీ, ఈసారి స్టార్ తిరిగేనా

  • Written By:
  • Updated On - February 9, 2024 / 07:04 PM IST

AP Politics: రాజమండ్రికి చెందినప్పటికీ ఆయనకు యాక్టర్ గా రాష్ట్రం మొత్తం గుర్తింపు ఉంది. అందుకే నంద్యాల పార్లమెంట్ స్థానానికి వైసీపీ అధిష్టానం ఆయన పేరును పరిశీలిస్తోందని చెబుతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ అధిష్టానం ఇప్పటివరకు ఆరు దఫాలుగా సీట్ల మార్పు చేర్పులు చేసింది. అందులో 70 అసెంబ్లీ స్థానాలు, 18 ఎంపీ స్థానాలు ప్రకటించింది. ఇంకా 105 అసెంబ్లీ స్థానాలు, 7 ఎంపీ స్థానాలు ప్రకటించాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు, నంద్యాల పార్లమెంట్ స్థానాలు న్నాయి. అయితే అధిష్టానం జనవరి 11న మూడో జాబితాలో కర్నూలు ఎంపీ స్థానాన్ని ఆలూరు ఎమ్మెల్యే, మంత్రి గుమ్మనూరు జయరాంకు కేటాయించింది.

ఎంపీగా పోటీ చేయడం ఇష్టం లేని మంత్రి కొంత కాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లారు. సీటు విషయంపై అధిష్టానం ఎంత ప్రయత్నించినా మంత్రి అందుబాటులోకి రాకపోవడంతో కర్నూలు జిల్లా అధ్యక్షుడు, నగర మేయర్ బీవై రామయ్యకు కేటాయించింది. ఇక మిగిలిన నంద్యాల పార్లమెంట్ స్థానంపై ఉత్కంఠ వీడడం లేదు. అభ్యర్థి ప్రకటన విషయంలో వైసీపీ అధిష్టానం ఆలస్యం చేస్తోంది. సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఈ సారి కూడా తనకే టికెట్ కేటాయించాలని అభ్యర్థించారు.

అధిష్టానం మాత్రం ఆయన పట్ల సానుకూలంగా స్పందించ లేదు. ఎంపీకి పలు సర్వేలు అనుకూలంగా లేవని చెబుతున్నారు. . ఎన్నికైనప్పటి నుంచి నేటి వరకు చెప్పుకోదగ్గ ప్రజా కార్యక్రమాలు చేయలేదు. అలాగే తన పార్లమెంట్ పరిధిలో కనీసం సొంతంగా బలమైన క్యాడర్ ను కూడా ఏర్పాటు చేసుకోకపోవడం ఈయనకు మైనస్ గా మారింది. ఎంపీ రేసులో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి, సినీ నటుడు అలీ, వైసీపీ రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ఖాదర్ బాషా, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. మరి జగన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారు అనేది వేచి చూడాల్సిందే.