రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీపికబురు చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వ్యక్తిగత రుణం అందిస్తామని అన్నారు. ఎలాంటి పూచీకత్తు లేకుండా ఈ రుణాన్ని ఇస్తారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డ్వాక్రా మహిళలు ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ రుణాన్ని మంజూరు చేస్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అద్భుత అవకాశం కల్పించింది. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10 లక్షల వరకు వ్యక్తిగత రుణం అందించనుంది. డ్వాక్రా మహిళలు ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. దీన్దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి కార్యక్రమం కింద ఈ రుణాన్ని అందిస్తారన్నారు. ఈ రుణం తీసుకోవడానికి డ్వాక్రా మహిళలకు ఎలాంటి పూచీకత్తు అవసరం లేదన్నారు. కేంద్రం ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఐఈఎల్ఏ విధానాన్ని తీసుకొచ్చిందని తెలిపారు.
ఏపీలో డ్వాక్రా మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. ఎవరైనా డ్వాక్రా మహిళలు ప్రస్తుతం నిర్వహిస్తున్న, ఒకవేళ కొత్తగా ప్రారంభించే ఎంఎస్ఎంఈ యూనిట్ల కోసం ఈ రుణాన్ని తీసుకోవచ్చని తెలిపారు. ప్రధానంగా వ్యవసాయ అనుబంధమైన ఫుడ్ ప్రాసెసింగ్ (మునగ, తేనె, పుట్టగొడుగుల ఉత్పత్తి, నర్సరీలు, సోలార్ డ్రయ్యర్లు, రక్షిత సాగు, చేపలు) వంటి ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. దీన్దయాల్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకం కింద వీటిని ప్రోత్సహిస్తారన్నారు. సెర్ప్శాఖలోని వెలుగు విభాగం అధికారులు ఈ యూనిట్లకు సంబంధించిన డీపీఆర్ తయారీ, దరఖాస్తులోనూ సహకారం అందిస్తారని, అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఐపీవోలను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ‘ఏపీ ఎస్ఎంఈ ఎక్స్ఛేంజ్’ ఏర్పాటుకు అవకాశాలపై రిపోర్ట్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల ఎంఎస్ఎంఈలకు సంస్థాగత రుణాలు పెరిగాయి. 2025-26లో రూ.1,16,274 కోట్లకు చేరడంతో ఎంఎస్ఎంఈల ప్రాధాన్యతను గుర్తించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఎస్ఎంఈ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేసి ఈక్విటీ, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నిధుల లభ్యతను మరింత మెరుగుపరిచేందుకు కసరత్తు చేస్తున్నారు. దీని కోసమే కమిటీని ఏర్పాటు చేశారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి ఛైర్మన్గా, పలు శాఖల నుంచి అధికారులు, మరికొందరితో టాస్క్ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు.
