వైసీపీని వీడి టీడీపీకి మద్దతు ఇచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైయ్యారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ నుంచి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీ ఇంఛార్జ్ గా అధిష్టానం ప్రకటించింది. ఇటు గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన ఉండవల్లి శ్రీదేవి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆమె టీడీపీకి మద్దతు ఇవ్వడంతో వైసీపీ నుంచి సస్పెన్షన్కు గురైయ్యారు. దీంతో ఆమె అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కేంద్ర కార్యాలయంలో నాయకులను కలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందకు ఉండవల్లి శ్రీదేవి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాడికొండ నియోజకవర్గంలో ఇప్పటికే సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్కుమార్ ఉండటంతో ఆమెకు అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం లేదు. దీంతో ఆమె వేరే నియోజకవర్గాలపై కన్నేశారు.
ఇటు కృష్ణాజిల్లాలో ఉన్న ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో తిరువూరు గత నాలుగు పర్యాయాలుగా ఓడిపోతూ వస్తుంది. అయితే ఈ సారి ఎలాగైన తిరువూరులో గెలవాలని టీడీపీ అధిష్టానం భావిస్తుంది. ఇందులో భాగంగా కొత్త వ్యక్తిని ఇంఛార్జ్గా నియమించింది. శావల దేవదత్ ఇంఛార్జ్గా అధిష్టానం నియమిచినప్పటికి ఆయనకు తిరువూరు నాయకులు మాత్రం సహకరించడంలేదు. ఇంఛార్జ్ కూడా ఒంటెద్దు పోకడలు పోతూ.. సీనియర్లను పక్కన పెట్టడం.. సోషల్ మీడియాలో తనకు అనుకూలంగా పోస్టులు పెట్టకపోతే వారిని తన వర్గం వారితో తిట్టించడం లాంటివి చేయడం క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమైంది.
We’re now on WhatsApp. Click to Join.
రెండేళ్లు దాటిన నియోజకవర్గంలో ఇంఛార్జ్ శావల దేవదత్ పట్టు సాధించకపోవడంతో పార్టీ అధిష్టానం ఆయనపై సీరియస్గా ఉంది. ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో అధినేత చంద్రబాబు సైతం నియోజకవర్గ నేతలకు, ఇంఛార్జ్కు గట్టిగా క్లాస్ పీకారట.. అధికార పార్టీ మీద పార్టీలో నేతలు కార్యక్రమాలు చేస్తుంటే ఇంఛార్జ్ మాత్రం తనకు సంబంధంలేదంటూ వ్యవహరించడం అధిష్టానం సీరియస్గా తీసుకుంది. పని చేయకపోతే పక్కన పెడతానంటూ చంద్రబాబు హెచ్చరికలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఉండవల్లి శ్రీదేవిని తిరువూరుకు పంపించే ఆలోచన అధిష్టానం చేస్తున్నట్లు సమాచారం.
ఎస్సీ మాదిగ సామాజివర్గానికి చెందిన ఉండవల్లి శ్రీదేవి.. ఆయన భర్త కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో నియోజకవర్గంలో ఇరు సామాజికవర్గాల మద్దతు లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్న ఉండవల్లి శ్రీదేవిని తిరువూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధిష్టానం భావిస్తుంది. ఇప్పటికే కొంతమంది తిరువూరు నేతలు ఆమె వద్దకు వెళ్లి తిరువూరు నుంచి పోటీ చేయాలని కోరినట్లు సమాచారం.
Also Read: Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ షరతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు