ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది. నిర్ణీత గడువులోగా భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా, రాజధాని ప్రాంతంలో పర్యటించిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ… ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవనాలు దాదాపుగా పూర్తికావొచ్చాయని మంత్రి వెల్లడించారు. మరో వారం రోజుల్లో ఎమ్మెల్యే భవనాలను, మరో 20 రోజుల్లో ఎమ్మెల్సీ భవనాలను సాధారణ పరిపాలన శాఖ (GAD)కు అప్పగిస్తామని తెలిపారు.
అధికారులు, మంత్రుల నివాస భవనాలు కూడా తుది దశకు చేరుకున్నాయని, మిగిలిన చిన్నపాటి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు ప్రక్రియపై కూడా మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే 98.6 శాతం మంది రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, మిగిలిన స్వల్ప శాతం ప్లాట్లు కొన్ని వివాదాల కారణంగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వీటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఇక అమరావతికి తలమానికంగా నిలిచే ఐకానిక్ టవర్ల నిర్మాణాన్ని 2027 ఆగస్ట్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
