Mega DSC : ఏపీ విద్యామంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా కీలక హామీ ఇచ్చారు. త్వరలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ తో భారీ ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని లోకేష్ తెలిపారు. ఏపీలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ సభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ (సంతనూతలపాడు), ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి (రాజంపేట), రేగం మత్స్యలింగం (అరకు), బి.విరూపాక్షి (ఆలూరు) పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ శాసనసభలో సమాధానమిచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి టీచర్ల ఖాళీలు భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు చెప్పిన నేపథ్యంలో లోకేష్ ఈ ప్రకటన చేశారు.
Read Also: Milk Mafia : మిల్క్ మాఫియా.. మాల్టోడెక్స్ట్రిన్ కలిపిన పాలతో గండం
గత 30 ఏళ్లలో టీడీపీ ప్రభుత్వాల హయాంలో 13 డిఎస్సీలను నిర్వహించి, 1,80,272 టీచర్ పోస్టులను భర్తీచేశామన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ లో సైతం 2014-19 కాలంలో చంద్రబాబు నేతృత్వంలోని టిడిపి ప్రభుత్వంలో సైతం 2014, 18, 19లలో మూడు డిఎస్సీలు నిర్వహించి 16,701 టీచర్ పోస్టులను భర్తీచేసిందని నారా లోకేష్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి గణాంకాల విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అయిదేళ్ల హయాంలో ఒక్క డిఎస్సీ కూడా విడుదల చేయలేదని లోకేష్ అన్నారు.
గత ప్రభుత్వం నాడు నేడుతో బిల్డింగులు కట్టినా విద్యార్థులు లేక స్కూళ్లు మూతపడ్డాయి. రంపచోడవరంలో 20 స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. కేజీబీవీలో ప్రహరి గోడలు నిర్మాణం చేపడతాం. స్కూళ్లలో సీసీటీవీ, లైటింగ్ ఏర్పాటు చేస్తాం. మౌలిక వసతుల కల్పనతో పాటు విద్యా వ్యవస్థను మెరుగు పరిచేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. 117 జీవో తీసుకొచ్చి గత ప్రభుత్వం నిరుపేద విద్యార్థులను చదువుకు దూరం చేసింది. దాదాపు ఐదేళ్లలో 12 లక్షల మంది స్కూళ్లకు దూరమయ్యారు. స్కూ్ళ్లకు వన్ స్టార్, టూ స్టార్ రేటింగ్ వచ్చిన వాటిపై తమ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ చేసిందని మంత్రి లోకేష్ అన్నారు.
Read Also: VV Vinayak : వీవీ వినాయక్ ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చిన టీం.. చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం అంటూ హెచ్చరిక..