ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయనందుకు చంద్రబాబునాయుడు సిగ్గుపడాలని మంత్రి ధర్మాన ప్రసాద్రావు అన్నారు. 14 ఏళ్ల పాటు ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండి ఉత్తరాంధ్రాలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ఉత్తర కోస్తా ఆంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్ని అని కొనియాడారు. ఆయన జలయజ్ఞంలో టెక్కలిలో తోటపల్లి, వంశధార, మహేంద్ర తనయ ఆఫ్షోర్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారని.. ముందుగా 14 ఏళ్లలో ఏం చేశారో చెప్పాలని మంత్రి ధర్మాన ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తిచేసుకుందని.. అందులో రెండేళ్లు కరోనా మహమ్మారిని ఎదుర్కొన్నామని వివరించారు. అయినప్పటికీ వైఎస్ జగన్ నాయకత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం వంశధార ప్రాజెక్టు 97 శాతం పూర్తి చేసిందన్నారు. ఈ ఏడాది డిసెంబరులో దీనిని జాతికి అంకితం చేస్తామన్నారు. నేరడి వద్ద అదనపు బ్యారేజీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చిస్తున్నారని మంత్రి ధర్మాన వివరించారు. శ్రీకాకుళంలోని ఉద్దానం ప్రాంతంలో దీర్ఘకాలికంగా ఉన్న కిడ్నీ వ్యాధులను తగ్గించేందుకు సీఎం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. భూగర్భజలాలు కిడ్నీ జబ్బులకు కారణమవుతాయని నిపుణులు గుర్తించిన నేపథ్యంలో హిరమండలం వద్ద గొట్టా బ్యారేజీ నుంచి తాగునీటిని పొందే పథకానికి జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ పూర్తయిందని త్వరలోనే ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారని ప్రసాదరావు తెలిపారు.