ఏపీ మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు 150 మంది అనుచరులతో కలిసి గురువారం తిరుమలను సందర్శించారు. అయితే ప్రోటోకాల్ దర్శనం కల్పించాలని టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. మంత్రి ఒత్తిడికి తలొగ్గి 20కి ప్రోటోకాల్ దర్శనం, మరో 100 మందికి బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ, దర్శనం కల్పించడంలో అప్పలరాజు అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వడంపై టీటీడీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
విలేకరుల ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. సాధారణ భక్తుల మాదిరిగానే తాము క్యూ లైన్లో వేచి ఉన్నామని, వేంకటేశ్వరునికి ప్రార్థనలు చేశామని చెప్పారు. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో చినముషిడివాడలోని శారదా పీఠంలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దర్శించిన సమయంలోనూ, తన అనుచరులను రానివ్వకుండా చేసిన సీఐని పరుష పదజాలంతో తిట్టాడు. దాంతో అప్పలరాజు వివాదంలో చిక్కుకున్నారు. సీఐ పట్ల మంత్రి అనుచిత ప్రవర్తనను ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం (ఏపీపీఓఏ) ఖండించింది. తాజాగా మరోసారి అప్పలరాజుపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ఒకేసారి 150 మందికి దర్శనం చేయించడం పట్ల సామాన్య భక్తులు సైతం మండిపడుతున్నారు.