Temperatures : బెంగాల్ తీరాన్ని దాటిన రెమాల్ తుఫాను ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం నెలకొని ఉక్కపోత మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చేవరకు ఇదే పరిస్థితి కొనసాగొచ్చని వాతావరణ నిపుణులు అంటున్నారు. వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈరోజు నుంచి జూన్ 3 వరకు తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరో ఒకటి, రెండు డిగ్రీలు పెరిగే రిస్క్ ఉందని అంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join
తుఫాను ప్రభావం వల్లే ఆంధ్రప్రదేశ్లోని పలు సముద్ర తీర ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ఎండ కనిపించలేదని నిపుణులు చెప్పారు. అయితే తీవ్ర వేడి, ఉక్కపోత ఆయా ప్రాంతాల ప్రజలను ఇబ్బంది పెట్టిందని తెలిపారు. ఈ ప్రతికూల పరిస్థితుల వల్ల ప్రత్యేకించి పిల్లలు, వృద్ధులు అవస్థలు పడ్డారని పేర్కొన్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల తీర ప్రాంతాల్లో ఇంతటి ఉక్కపోత ఉంటోందన్నారు. జూన్ 3 వరకు ఏపీలోని తీర ప్రాంతాల్లో తేమ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. రెమాల్ తుఫాను ప్రభావంతో ఏపీలోని కాకినాడ, విజయవాడ నగరాల్లో మాత్రమే వర్షాలు పడ్డాయి. మిగతా అన్ని తీర ప్రాంతాల్లోనూ పొడి వాతావరణమే కంటిన్యూ అవుతోంది.
మంగళవారం నుంచి గరిష్ఠ ఉష్ణోగ్రతలు(Temperatures) 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ‘సోమవారం అనకాపల్లి జిల్లాలో 14 వడగాలులు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 10 వడగాలులు వీచే ఛాన్స్ ఉంది. మంగళవారం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని 43 మండలాల్లో వడగాలులు వీచే ఛాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.