ఏపీపై భానుడు పగబట్టినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రంపై నిప్పుల వాన కురిస్తున్నట్లుగా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆదివారం ఎండ తీవ్రత అమాంతం పెరిగింది. దీంతోపాటు వడగాలులు కూడా జనాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాలంటేనే ప్రజలు వణికిపోయారు. వడగాలుల తీవ్రతకు చాలా చోట్ల ప్రజలు సొమ్మసిల్లిపడిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 21 మండలాల్లో నిన్న వడగాలులు విచినట్లుగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
తణుకు, తాడేపల్లిగూడెం, ఇబ్రహీంపట్నం, ఉండ్రాజవరంలో 44.8డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మిగతా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగానే పగటి ఉష్ణోగ్రతలు నమోదుయ్యాయి. ఇవాళ కూడా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 84 మండలాల్లో వడగాలులు వీచే ఛాన్స్ ఉందని…ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కోస్తా రాయలసీమల్లో నేడు అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు.