రెండు రోజుల మహానాడు వేదికపై(Mahanadu 2023) నారా లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే, ఆయన అందరిలో ఒకడిగా ఉండాలని ప్రయత్నించారు. అయినప్పటికీ కేంద్రబిందువుగా మారారు. వీలున్నంత వరకు లో ప్రొఫెల్ ఉండేలా జాగ్రత్త పడ్డారు. చిరకాలంగా పెండింగ్ ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ప్రస్తావన లేకుండా మహానాడు ముగిసింది. వ్యూహాత్మకంగా లోకేష్ ను(Lokesh) ఎలివేట్ చేశారని పార్టీ వర్గాల్లోని చర్చ. పూర్తిగా రాజకీయ వ్యూహకర్త రాబిన్ సింగ్ ఇచ్చిన డైరెక్షన్ మేరకు మహానాడు నడిచిందని అర్థమవుతోంది. స్వర్గీయ ఎన్టీఆర్ ను ఫోకస్ చేస్తూ చంద్రబాబు నాయకత్వాన్ని ఎలివేట్ చేయడానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో లోకేష్ భవిష్యత్ లీడర్ గా చూపించారు.
మహానాడు (Mahanadu 2023) ముగిసిన తరువాత పోస్ట్ మార్టం ప్రారంభించారు వైసీపీ లీడర్లు. ప్రధానంగా నారా లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కుపెట్టారు. నందమూరి, నారా కుటుంబాల మధ్య ఉన్న గ్యాప్ ను ఎలివేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మహానాడు వేదికపై స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్ ఫోటోలు మాత్రమే ఉండడాన్ని వేలెత్తిచూపుతున్నారు. ఏ హోదాలో లోకేష్ ఫోటోలను పెట్టారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, నందమూరి కుటుంబాన్ని కించపరిచేలా మహానాడు వేదిక ఉందని మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని లాజిక్ తీశారు. ఎన్టీఆర్ సినీ వారసుడు, ఎమ్మెల్యే బాలక్రిష్ణ (Balayya)ఫోటో లేకుండా కించిపరిచారని దుయ్యబట్టారు.
వాస్తవంగా ఇప్పటి వరకు లోకేష్ ఎమ్మెల్యేగా గెలవలేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎక్కడా విజయం సాధించలేదు. పరోక్షంగా ఆయన్ను ఎమ్మెల్సీ చేయడం ద్వారా మంత్రిని చేశారు. ప్రజాబలం ఆయనకు ఎంత ఉంది? అనే ప్రశ్నకు జవాబులేదు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి హోదాలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. అది కూడా చంద్రబాబు వ్యూహాత్మకంగా చేసిన కార్యక్రమం కింద వైసీపీ పరిగణిస్తోంది. నందమూరి కుటుంబాన్ని కించపరుస్తూ ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టుకుని రాజకీయాలు చేయడం ఏమిటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక మేనిఫెస్టో విషయంలోనూ వైసీపీ మీడియా ఎదుట అభ్యంతరాలను వ్యక్తం చేసింది. కర్ణాటక కాంగ్రెస్ మేనిఫెస్టోలో కొంత, వైసీపీలోని నవరత్నాల్లో మరింత తీసి అతికించిన మేనిఫేస్టోగా కొట్టిపారేస్తోంది. ఇదంతా ఒక ఎత్తైతే, లోకేష్ పదోన్నతి విషయంపై ప్రస్తావన లేకుండా టీడీపీ జాగ్రత్తపడింది.
Also Read : Mahanadu 2023: వైభవంగా మహానాడు, టీడీపీ జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు ఏకగ్రీవం
రాజకీయ వ్యూహకర్తగా ఉన్న రాబిన్ సింగ్ ఐ ప్యాక్ కు చెందిన వ్యక్తి. గత ఎన్నికల్లో కేవలం ఐ ప్యాక్ కారణంగా జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చాయని టీడీపీ విశ్వసిస్తోంది. అందుకే, ఈసారి ఐ ప్యాక్ లోని కీలక వ్యూహకర్తగా ఉన్న రాబిన్ సింగ్ ను టీడీపీ నమ్ముకుంది. ఆయన వ్యూహాల ప్రకారం చంద్రబాబు సైతం నడుచుకుంటున్నారు. ఇక లోకేష్ పాదయాత్ర కూడా అంతే. ఆ క్రమంలో మహానాడు వేదికపై లోకేష్ పదోన్నతిని వ్యూహాత్మకంగా ప్రస్తావనకు రాకుండా రాబిన్ సింగ్ చేశాడని తెలుస్తోంది. వాస్తవంగా ఆయన కార్యకర్తల సమన్వయ కమిటీ కన్వీనర్ గా రాజకీయాన్ని మొదలు పెట్టారు. ఆ తరువాత జాతీయ ప్రధాని కార్యదర్శిగా సంస్థాగత పదోన్నతి పొందరు. దానికి సమాంతరంగా మంత్రి పదవిని కూడా అప్పట్లో అప్పగించారు. ఆ సమయంలో కాబోయే సీఎం లోకేష్ అంటూ సహచర మంత్రులు పోటీపడి ఎలివేట్ చేశారు. అధికారం పోయిన తరువాత ఆ వాయిస్ మూలనపడింది.
యువగళం పాదయాత్ర చేస్తోన్న లోకేష్ గ్రాఫ్ పెరిగిందని టీడీపీ విశ్వసిస్తోంది. అదే సమయంలో పొత్తుల మీద విజయం ఆధారపడి ఉందని నమ్ముతోంది. అందుకే, లోకేష్ ను(Mahanadu 2023) మరింత ఎలివేట్ కాకుండా చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం జనసేనాని పవన్ టీడీపీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నారు. ఒక వేళ లోకేష్ కాబోయే సీఎం అంటే పొత్తుకు మొదటికే మోసం వస్తుంది. అందుకే, కాబోయే సీఎం నినాదాన్ని ప్రస్తుతం తెరవెనుక్కు వ్యూహాత్మకంగా తీసుకెళ్లారు. ఇక సంస్థాగతంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగిస్తే రాబోవు రోజుల్లో కాబోయే సీఎం అనే సంకేతం వెళుతుంది. అప్పుడు ప్రత్యర్థులు జనసేనాని పవన్ మీద మరో కోణం నుంచి రాజకీయ దాడి చేసే ఛాన్స్ ఉంది. ఇలా పలు కోణాల నుంచి ఆలోచించిన తరువాత లోకేష్ పదోన్నతికి తాత్కాలికంగా బ్రేక్ పడిందని పార్టీ కోర్ టీమ్ లోని చర్చ.
Also Read : YCP Criminal status : YCP నేర చిట్టా విప్పిన CBN! జగన్ జమానాలో 70శాతం పెరిగిన కోర్టు ఖర్చు!!