అమరావతి టూ అరసవల్లి మహా పాదయాత్ర తణుకు నుంచి ముందుకు సాగడం కష్టమే. మూడు రాజధానులకు మద్ధతుగా అక్కడి వైసీపీ శ్రేణులు రోడ్డు మీదకు వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నరేంద్ర సెంటర్ కు పాదయాత్ర చేరుకునే సమయానికి వైసీపీ భారీ ర్యాలీ ఎదురయింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
గోదావరి జిల్లాల్లోని కొన్ని చోట్ల రైతులకు అండగా స్థానిక ప్రజలు నిలిచారు. కానీ, ఉత్తరాంధ్రలోకి అడుగుపెట్టే సమయానికి పరిస్థితులు అదుపు తప్పేలా ఉంది. తణుకు కేంద్రంగా చేసుకుని జరిగిన సంఘటన అందుకు నిదర్శనంగా ఉంది. గతంలోనూ చంద్రబాబు మూడు రాజధానులను నిరసిస్తూ జోలె పట్టినప్పుడు ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఆయన అర్థాంతరంగా ఆ కార్యక్రమాన్ని ముగించుకున్నారు.
ప్రస్తుతం అమరావతి రైతులు గోదావరి జిల్లాలకు చేరుకోవడంతో ప్రతిఘటన ఎదురవుతోంది.` ఫేక్ రైతులు, ఫేక్ యాత్ర గో బ్యాక్ అంటూ వైసీపీ మద్ధతుదారులు స్లోగన్స్ చేశారు. మూడు రాజధానులకు మద్ధతుగా బ్యానర్లు, ఫ్లెక్సీలతో ఆ పార్టీ క్యాడర్ హల్ చల్ చేసింది. ఇలాంటి పరిస్థితే ప్రతి రోజూ రైతులు ఇక నుంచి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, హైకోర్టు ఆదేశాల మేరకు కొన్ని ఆంక్షల నడుమ పాదయాత్ర కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఏపీ పోలీస్ పై ఉంది. వాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.