Vijayawada : విజయవాడలోని సున్నపు బట్టీల సెంటర్లో ఉన్న ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతిచెందగా, నలుగురికి గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండచరియల ధాటికి ఒక ఇల్లు ధ్వంసమైంది. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకునేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం శిథిలాలు, కొండ చరియలను తొలగించే ప్రక్రియ జరుగుతోంది. భారీ సైజులో ఉన్న కొండచరియ విరిగి పడటంతో పెద్ద పిడుగు లాంటి శబ్దం వచ్చింది. దీంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇంక దాని కింద నలిగిపోయిన వారి పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షించారు. భారీ వర్షాలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 45, 51 డివిజన్లలో రెండు చోట్ల ఇళ్లు కూలాయని ఆయన తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
మరోవైపు విజయవాడ నగరంలో(Vijayawada) శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. ఈనేపథ్యంలో అధికారులను మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అప్రమత్తం చేశారు. నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్రతో ఫోన్లో మాట్లాడి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలు,రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. డ్రైనేజీలు పొంగిపొర్లకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు.
Also Read :Paris Paralympics 2024: పారా ఒలింపిక్స్.. ఒకేరోజు నాలుగు పతకాలతో సత్తా..!
ఏపీలోని విశాఖ నగరంలోనూ భారీ వర్షం కురుస్తోంది. దీంతో విశాఖలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగానూ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలోని కట్టలేరు వాగుకు వరద పోటెత్తడంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రకాశం బ్యారేజీలోని మొత్తం 70 గేట్లు ఎత్తి 3,32,374 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతాలను కలెక్టర్ అప్రమత్తం చేశారు.