ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా పేరు మారింది. దాని పేరును ”డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా”గా మార్చారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ను జారీ చేయనుంది. దీనిపై వచ్చే అభ్యంతరాలను పరిశీలించి, నెల రోజుల్లోగా తుది నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. పేరు మార్పుపై ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే 30 రోజుల్లోగా తెలపాలని ప్రభుత్వం కోరింది. సూచనలు, సలహాలను జిల్లా కలెక్టర్కు తెలపాలని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది.
రామచంద్రాపురం, అమలాపురం, మండపేట అనే మూడు మునిసిపాలిటీల కలయికగా ఈ జిల్లా ఏర్పడింది. ఇందులో అమలాపురం, రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్లతో పాటు 22 మండలాలు ఉన్నాయి. ఈ జిల్లాలో దళిత జనాభా ఎక్కువగా ఉన్నందున .. భారత రాజ్యాంగ నిర్మాత బీ.ఆర్.అంబేద్కర్ పేరును పెట్టాలని వై.ఎస్.జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో చాలా రోజులుగా వినిపిస్తున్న దళిత సంఘాల డిమాండ్ కూడా నెరవేరినట్లు అయింది. అమలాపురం హెడ్ క్వార్టర్స్గా ఈ జిల్లా ఉంది.