కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని భయపెట్టే అంత సీన్ కేసీఆర్ కు (KCR Drama) ఉందా? అనేది సర్వత్రా తెలిసిందే. కానీ, కేసీఆర్ దెబ్బకు మోడీ సర్కార్ భయపడి విశాఖ స్టీల్(Vizag steel) ప్రైవేటీకరణ చేయడం మానుకుందని కల్వకుంట్ల కుటుంబం మీడియాకు ఎక్కింది. వినేవాళ్లు ఉంటే చెప్పే వాళ్లు ఏదైనా చెబుతారని సామెతలా వాళ్ల వ్యాఖ్యలు ఉన్నాయి. గత వారం రోజులుగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద బీఆర్ఎస్ చెబుతున్న మాటలన్నీ అబద్దాలే. ప్రైవేటీకరణ కోసం కేంద్రం బిడ్డింగ్ వేస్తుంది అనేది శుద్ధ అబద్ధం. టెండర్లో తెలంగాణకు చెందిని సింగరేణి కంపెనీ పాల్లొంటుందని మంత్రి కేటీఆర్ చెప్పడం విడ్డూరం. దీనిలోని వాస్తవాలను గమనిస్తే విశాఖ స్టీల్ వైపు చూసేంత సీన్ కేసీఆర్ కు లేదని ఎవరైనా చెప్పగలరు. వాస్తవాలను పరిశీలిస్తే..
మోడీని భయపెట్టే అంత సీన్ కేసీఆర్ కు ఉందా?(KCR Drama)
*విశాఖ ఉక్కు కర్మాగారం (Vizag steel) ప్రయివేటీకీకరణ, విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే “స్టీల్ మార్కెటింగ్” తద్వారా వర్కింగ్ క్యాపిటల్ ను సమకూర్చు కోవడం, ఈ రెండు వేరు వేరు అంశాలు. రాజకీయ లబ్ధి కోసం రెండింటినీ కలగాపులగం చేసి ప్రజల్లో కల్వకుంట్ల కుటుంబం(KCR Drama) గందరగోళం సృష్టించింది.
* “ప్రభుత్వం వ్యాపారం చేయకూడదు” అన్నది బిజెపి – ఆర్.ఎస్.ఎస్. భావజాలం. దాన్ని మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని(Vizag steel) వందకు వంద శాతం ప్రయివేటీకరణ చేస్తామని పదే పదే పునరుద్ఘాటిస్తూ, నిర్వహణ వ్యయానికి అవసరమైన “వర్కింగ్ క్యాపిటల్”ను కేంద్ర ప్రభుత్వం సమకూర్చకుండా సహాయ నిరాకరణ చేస్తున్నది. బ్యాంకుల నుండి అప్పు తెచ్చుకోవడానికి కూడా “బ్యాంక్ గ్యారెంటీ” లేకుండా చేసి, అవరోధాలు సృష్టించబడుతున్నాయి. పర్యవసానంగా విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వహణ కోసం నిధుల కొరత సమస్యను ఎదుర్కొంటున్నది.
*”వర్కింగ్ క్యాపిటల్”ను సమకూర్చుకోవడానికి విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అది, విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉత్పత్తి అయ్యే “స్టీల్ మార్కెటింగ్”కు సంబంధించినది మాత్రమే.
ప్రయివేటీకరణ చేస్తామని నోటిఫికేషన్ జారీ చేయలేదు
* విశాఖ ఉక్కు కర్మాగారాన్ని(Vizag steel) ప్రయివేటీకరణ చేస్తామని మోడీ ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకున్నది. కానీ, ఇంకా నోటిఫికేషన్ జారీ చేయలేదు, టెండర్ పిలవలేదు. విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించి పూర్తి యాజమాన్య హక్కు కేంద్ర ప్రభుత్వానిదే. అమ్మకానికి సంబంధించిన ప్రక్రియలో మోడీ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నది. అది సుస్పష్టం. కానీ, అధికారుల స్థాయిలో 2023 మార్చి 27న జారీ చేసిన నోటిఫికేషన్ ఆ ప్రక్రియలో భాగం కాదన్నది గమనించాలి.
* ఒక ఉదాహరణ; ఒక రైతుకు భూముంది. వరి సాగుచేసే నైపుణ్యం ఉంది. ట్రాక్టర్ మరియు ఇతర వ్యవసాయ పనిముట్లు ఉన్నాయి. కానీ, వ్యవసాయ ఖర్చులకు అంటే విత్తనాలకు, ఎరువులకు, పురుగు మందులకు, కూలీలకు, ట్రాక్టర్ మరమ్మత్తులకు – డీజిల్ కు డబ్బుల్లేవు. నిధులను సమకూర్చుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. విత్తనాలు – ఎరువులు – పురుగు మందులను సరఫరా చేస్తాము, సేద్యం ఖర్చులకు డబ్బు సమకూర్చుతాము, పంట పండాక వడ్లు మాకు అమ్ముతావా! అన్న ప్రతిపాదనతో ఏ సంస్థ లేదా వ్యక్తి అయినా రైతును సంప్రదించవచ్చు. ఇరువురి మధ్య అవగాహన కుదిరితే వ్యాపార ఒప్పందం చేసుకొంటారు.
వ్యాపారానికి సంబంధించిన వ్యవహారం (Vizag steel)
* ఆ కోవకు చెందినదే విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యం 2023 మార్చి 27న జారీ చేసిన నోటిఫికేషన్. స్టీల్ అవసరం ఉన్న, లేదా, స్టీల్ వ్యాపారం చేస్తున్న సంస్థలు ముందుకొచ్చి స్టీల్ ఉత్పత్తికి సంబంధించి తమ వద్ద ఉన్న ముడి సరుకు అంటే ఇనుప ఖనిజం/బొగ్గు/ తదితర ముడి సరుకులు సరఫరా చేయడానికి లేదా డబ్బు చెల్లించడానికి సిద్ధపడుతూ ఆసక్తి వ్యక్తం చేస్తే, ఆ సంస్థల ఆర్థిక పరిస్థితిని మదింపు వేసుకొని, నిబంధనలకు లోబడి ఒప్పందం చేసుకుంటామని విశాఖ ఉక్కు కర్మాగారం యాజమాన్యం వారి నోటిఫికేషన్ లో పేర్కొన్నది. ఇది కేవలం వ్యాపారానికి సంబంధించిన వ్యవహారం.
* విశాఖ ఉక్కు కర్మాగారం, తన స్టీల్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకొని, తమకు అవసరమైన ముడి సరుకును మరియు నిర్వహణకు అవసరమైన మూలధనాన్ని సమకూర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. ఈ వ్యవహారానికి, మోడీ ప్రభుత్వం ప్రకటించిన విశాఖ ఉక్కు కర్మాగారం (Vizag steel) ప్రయివేటీకీకరణ విధానానికి లింకు పెట్టి మాట్లాడుకోవడం వల్ల ఫలితం శూన్యం. రాజకీయ లబ్ధి కోసం, కుటిల రాజకీయ నీతిలో భాగంగా, ఉద్దేశ్య పూర్వకంగా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నట్లు కనబడుతున్నది. “ఎద్దు ఈనిందంటే దొడ్లో కట్టివేయ మన్నట్లు” అన్న నానుడిగా గత రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చలు జరుగుతున్నాయి.
రాజకీయ లబ్ధి కోసం, కుటిల రాజకీయ నీతిలో భాగం
* విశాఖ ఉక్కు కర్మాగారం (Vizag steel)ఆర్థిక స్థితిగతులపై ఆసక్తి ఉన్న వారు 2021 – 22 ఆర్థిక సంవత్సరం ఆర్థిక నివేదికను అధ్యయనం చేయండి. ఆ ఏడాదిలో విశాఖ ఉక్కు కర్మాగారం యొక్క అమ్మకాలు రు.5.23 మి.టన్నులు, స్థూల ఆదాయం రు.28,647 కోట్లు. 2020-21 కంటే 57% అధికంగా ఆదాయాన్ని నమోదు చేసుకొన్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు రు.3,480 కోట్లు సమకూర్చింది. పన్ను చెల్లింపు తర్వాత నికర లాభం రు.913 కోట్లు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రు.21,089 కొట్లుగా ఉన్న బుణ భారాన్ని 2021-22 నాటికి రు.17,148 కోట్లకు తగ్గించుకొన్నది. 7.5 మిలియన్ టన్నుల గరిష్ట ఉత్పత్తి సామర్థ్యం, 2021-22లో 5.77 మి.టన్నుల ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది.
విశాఖ ఉక్కు నాణ్యమైనది
* 2022 -23లో వర్కింగ్ క్యాపిటల్ లేకపోవడంతో, ఆసియా ఖండంలోనే అత్యాధునిక బ్లాస్ట్ ఫర్నేస్ గా భావించబడే మూడవ బ్లాస్ట్ ఫర్నేస్ ఏడదికిపైగా ఆపరేషన్ లో లేదు. దాన్ని ఆపరేషన్ లోకి తీసుకురావడానికి రు.1000 కోట్లు అవసరమట. నిర్వహణ వ్యయం, వేతనాలు(15,696 మంది శాశ్వత ఉద్యోగులు, కార్మికులు మరియు దాదాపు 18,000 కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు), తదితర ఖర్చుల కోసం రాబోయే నాలుగైదు మాసాలకు నాలుగైదు వేల కోట్లు అవసరమని చెబుతున్నారు. ఆ మేరకు వర్కింగ్ క్యాపిటల్ ను సమకూర్చుకోవడానికే యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసింది. వర్కింగ్ క్యాపిటల్ లేకపోవడంతో 2022-23 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు 3.75 మి.టన్నులకు పడిపోయి, స్థూల ఆదాయం రు.22,770 కోట్లకు తగ్గింది. ఈ పరిస్థితి కొనసాగితే పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది.
కర్మాగారంలో భాగస్వామ్యం అయ్యేలా జగన్మోహన్ రెడ్డి
* విశాఖ ఉక్కు నాణ్యమైనది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా విశాఖ ఉక్కు కర్మాగారం నోటిఫికేషన్ కు అనుగుణంగా స్టీల్ కొనుగోలుపై ఆసక్తి వ్యక్తంచేస్తూ దరఖాస్తు చేసి, వర్కింగ్ క్యాపిటల్ ను సమకూర్చాలి. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు మరియు నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్టులకు, బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకం, వగైరా నిర్మాణాలకు స్టీల్ అవసరం ఉన్నది కదా! అలాగే, కేంద్ర ప్రభుత్వ రంగం సంస్థ “స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా” మరియు నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లు విశాఖ ఉక్కు కర్మాగారంలో భాగస్వామ్యం అయ్యేలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, పార్లమెంటు సభ్యులు, అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి.
* సమస్య మౌలిక స్వభావాన్ని, కేంద్ర ప్రభుత్వం వైఖరిని, యాజమాన్యం అమలు చేస్తున్న నిర్ణయాలను నిశితంగా అధ్యయనం చేసి, స్పందించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ఉద్యమకారులపైన ఉన్నది. “నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కించినట్లు” వ్యవహరించే కేసీఆర్ (KCR Drama)మాటలను ఎవరైనా పొరపాటున నమ్మితే “కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లు” అన్న సామెతగా తయారవుతుంది.
కేసీఆర్ మాటలను ఎవరైనా పొరపాటున నమ్మితే (Vizag steel)
* విశాఖ ఉక్కు (Vizag steel) ఆంధ్రుల హక్కు నినాదంతో 33 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో పరిరక్షించు కోవడానికి కలిసొచ్చే వారందరినీ కలుపుకొని మోడీ ప్రభుత్వాన్ని నిలువరింప చేయాలి. విశాఖ ఉక్కు కర్మాగారం జాతి సంపద. కార్పోరేట్ సంస్థల పరం కాకుండా రక్షించుకోవడమే నిజమైన దేశభక్తి.
Also read : Vizag Steel : KCR ఖాతాలోకి విశాఖ! `కల్వకుంట్ల`తో అంతే.!
వాస్తవాలు ఇలా ఉండగా, వారం రోజులుగా మంత్రి కేటీఆర్, హరీశ్ రావు మొదలు బీఆర్ఎస్ లీడర్లు ఇష్యూను(KCR Drama) సానుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. కానీ, తెలంగాణ ప్రజల మాదిరిగా ఏపీ ప్రజలు ఉండరని మంత్రులు అప్పలరాజు, పేర్ని నాని తదితరులు చెబుతున్నారు. ఇప్పటికైనా అబద్ధాలను పక్కన పెట్టి రాజకీయాలు చేయాలని కల్వకుంట్ల కుటుంబానికి చురకలు వేస్తున్నారు. అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టగలరేమోగానీ, ఏపీ ప్రజలను బోల్తా కొట్టించలేరని కల్వకుంట్ల కుటుంబానికి ఏపీ మంత్రులు వార్నింగ్ ఇస్తున్నారు. మొత్తం మీద కేటీఆర్, హరీశ్ రావు, కేసీఆర్ విశాఖ స్టీల్ విషయంలో చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది. అంటే, కేసీఆర్ ప్రతిపాదనను గమనించి మెడీ సర్కార్ భయపడింది అని చెప్పడం శుద్ద అబద్ధమన్నమాట.
Also Read : KCR on Vizag Steel Plant: విశాఖ ఉక్కు బిడ్డింగ్ లో కేసీఆర్